ఆర్టీసీ ఎండీ రేసులో నలుగురు.. ఐపీఎస్కే బాధ్యతలు... ఎందుకంటే....
టీఎస్ఆర్టీసీలో సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలపై హైకోర్టు సీరియస్ కావడంతో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతధికారులతో సమీక్షించారు. హైకోర్టు మార్గనిర్దేశనం ప్రకారం ఆర్టీసీకి కొత్త ఎండీని నియమించడంపై కసరత్తు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి.
తెరపైకి కమిటీ
ఆర్టీసీ జేఏసీ నేతలతో కూడా చర్చలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐఏఎస్ కమిటీతో చర్చలు జరపాలా ? లేదా నేతలతో చర్చలు జరపాలా అనే అంశంపై డిస్కస్ చేస్తున్నారు. దీంతోపాటు ఆర్టీసీలో 50 శాతం ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టాలనే అంశంపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు అభిప్రాయం తీసుకొని ప్రభుత్వం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
ఖాళీగా ఎండీ పోస్ట్
ఆర్టీసీకి దాదాపు 15 నెలలుగా ఎండీ పోస్టు ఖాళీగా ఉంది. ఇంచార్జీ ఎండీ ఉండటంతో పాలన పడకేసిందని, సమస్యలు పరిష్కారం కావని హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ నెల 18వ తేదీ లోపు శుభవార్తతో రండి అని స్పష్టంచేయడంతో.. ఆ మేరకు ప్రభుత్వం కూడా అడుగులేస్తోంది. తొలుత ఆర్టీసీ ఎండీని నియమించే చర్యను చేపట్టింది. ఇందులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి.
రేసులో ప్రవీణ్
ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రేసులో ముందున్నారు. ఐపీఎస్ అధికారి అయిన ఈయన తెలంగాణ సాంఘీక/గురుకుల పాఠశాల కార్యదర్శిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రవీణ్ కుమార్ తర్వాత అకున్ సబర్వాల్ పేరు వినిపిస్తోంది. సబర్వాల్ కూడా ఐపీఎస్. డ్రగ్స్ కేసు విచారించి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు.
వీరు కూడా
శివధర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఓటుకు నోటు కేసులో శివధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అప్పటి ఐబీ చీఫ్గా ప్రభుత్వానికి సమాచారం అందించి.. రేవంత్రెడ్డిని అడ్డంగా పట్టించడంలో ముఖ్యభూమిక పోషించారు. తర్వాత స్టీపెన్ రవీంద్ర పేరు కూడా ఉంది. అయితే వీరంతా ఐపీఎస్ అధికారులే. సాధారణంగా ఆర్టీసీ ఎండీ పదవీకి ఐఏఎస్ అధికారి నియమించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎస్ అధికారిని నియమించారు.