తెలంగాణలో కాంగ్రెస్ బలంగా లేదు, బాలయ్యకే ఆ బాధ్యతలు - కాసాని..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది. కాంగ్రెస్, బీజేపీ గెలుపుపై ఆశతో ఉన్నాయి. ఇప్పటికే జనసేన 32 స్థానాల్లో పోటీకి నిర్ణయించింది. టీడీపీ పోటీ..పొత్తులపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇదే అంశం పైన తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ లో నందమూరి బాలకృష్ణ కీలకంగా వ్యవహరిస్తారని వెల్లడించారు.
చంద్రబాబు కోసం నిరీక్షణ
తెలంగాణలో ఎన్నికల దిశగా పార్టీలు సిద్దమయ్యాయి. ప్రచారం ప్రారంభించాయి. కానీ, టీడీపీలో మత్రం ఇంకా పోటీ పైన చర్చ కొనసాగుతోంది. తెలంగాణలో పోటీ చేయాలా వద్దా..పొత్తుల అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేది ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో పార్టీ పరంగా నిర్ణయాలు సమస్యగా మారాయి.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ టీడీపీ అధినేత కాసాని జ్ఞానేశ్వర్ రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసారు. తెలంగాణ ఎన్నికల అంశాన్ని చర్చించారు. కానీ, నిర్ణయం జరగలేదు. ఈ వారంలో చంద్రబాబు బయటకు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే తెలంగాణలో పోటీ...పొత్తులపైన నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాసాని సైతం ఇదే అంశాన్ని వెల్లడించారు.
బాలయ్యకు ప్రచార బాధ్యతలు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ విషయం లో అలాగే రాజకీయ పరంగా బుధవారం క్లారిటీ వస్తుందని కాసాని చెప్పుకొచ్చారు. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తో ఉన్నాయని వివరించారు. త్వరలోనే ఎన్నికలకు సంబందించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ బలం గా ఉందని ధీమా వ్యక్తం చేసారు.
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కంటే బలం గా ఉంది అనేది తాము నమ్మడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముందుకు వెళ్లాలా లేదా అనేది భవిష్యత్ లో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పోటీ పైన నిర్ణయం తీసుకున్న వెంటనే అభ్యర్థులు లిస్ట్ తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని కాసాని వెల్లడించారు.

పొత్తులపై తేలని నిర్ణయం
తెలంగాణ లో కావలసిన అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. ఎన్నికల కోసం తాము కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దాదాపు 87 స్థానాల్లో అభ్యర్దుల పేర్లు సిద్దం చేసామని చెప్పారు. చంద్రబాబు ఆమోదంతో పేర్ల ప్రకటన ఉంటుందన్నారు. పార్టీ తరపున హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారని ప్రకటించారు.
ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలతో బాలయ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇక, రేప సుప్రీంలో క్వాష్ విచారణ..అదే సమయంలో హైకోర్టులో బెయిల్ పైన విచారణ ఉండటంతో చంద్రబాబు బయటకు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ తరువాతనే తెలంగాణలో ఎన్నికల కార్యాచరణ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications