సీఐ అదృశ్యం కేసులో ట్విస్ట్, రిసార్ట్లో ఉన్న సీఐ? క్షేమమేనన్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర
Recommended Video
హైదరాబాద్: నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యం కేసులో ట్విస్ట్ మీద ట్విస్టులు వెలుగులోనికి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.
మరో 'పరువు హత్య': కూతురి మతాంతర ప్రేమ.. ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకున్న కుటుంబం!
మరోవైపు సీఐ వెంకటేశ్వర్లు.. జనవరి 24న జరిగిన నల్గొండ మునిసిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో విచారణాధికారిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆయన అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
అదృశ్యమైన 24 గంటల తరువాత నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించింది. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సమీపంలో ఓ రిసార్టులో ఉన్నారని, కాసేపట్లో ఆయన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముందు హాజరవుతారంటూ వార్తలు వెలువడ్డాయి.
వారికి బెయిల్.. ఈయన అదృశ్యం...
నల్గొండ మునిసిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వారికి బెయిల్ వచ్చిన మరుసటి రోజు అంటే శుక్రవారం నుంచే ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యం కావడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ విషయంలో నిందితులకు సంబంధం ఉండి ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తీవ్ర ఆందోళనలో సీఐ కుటుంబం...
శుక్రవారం ఉదయం మాడ్గులపల్లి పోలీసుస్టేషన్లో డిపార్ట్మెంట్ సిమ్కార్డును ఇచ్చేసిన సీఐ... పర్సనల్ ఫోన్ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. అలాగే తన సర్వీస్ రివాల్వర్ను ఆయన తన డ్రైవర్కు అప్పగించి వెళ్లిపోయారు. సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యంపై ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 24 గంటలు దాటినా ఆయన ఆచూకీ లభించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. సీఐ వెంకటేవ్వర్లు ఆచూకీ కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
తీవ్ర మానసిక ఒత్తిడితోనే అదృశ్యం...
మరోవైపు తన పోలీస్స్టేషన్ పరిధిలో వరుసగా రెండు హత్యలు జరగడం, బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కొంతమంది నిందితులకు బెయిల్ రావడం వంటి కారణలతో సీఐ వెంకటేశ్వర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఉన్నట్లుండి సీఐ అదృశ్యం అవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు సీఐ వెంకటేశ్వర్లు ఎవరికీ చెప్పా పెట్టకుండా అంత బాధ్యతారాహితంగా ఎక్కడికెళ్లినట్లు? కనీసం ఆయన ఆచూకీని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం ఏమిటి?
క్షేమమే, ఆచూకీ లభించింది: ఐజీ స్టీఫెన్ రవీంద్ర
అదృశ్యమైన 24 గంటల తరువాత నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించింది. ఆయన మిర్యాలగూడ సమీపంలో ఓ రిసార్టులో ఉన్నారని, కాసేపట్లో ఆయన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముందు హాజరవుతారంటూ తొలుత వార్తలు వెలువడ్డాయి. ఆయితే ఆ తరువాత ఐజీ స్టీఫెన్ రవీంద్రను ఉటంకిస్తూ మరో ప్రకటన వెలువడింది. సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించిందని, ఆయన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఓ రిసార్టులో క్షేమంగానే ఉన్నారని ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరోవైపు సీఐ కుటుంబ సభ్యులు కూడా నల్గొండ బయలుదేరినట్లు తెలుస్తోంది.