మాయ లేడీలు: పాపకు దిష్టి తీస్తామని రూ. 76 వేలకు టోకరా
హైదరాబాద్: పూజల పేరుతో ఇద్దరు మహిళలు హైదరాబాదులోని మాదాపూర్లో రూ.76 వేలకు టోకరా వేశారు. పాపకు దిష్టి తీస్తామనే పేరుతో కుటుంబ సభ్యులను నమ్మించి ఆ డబ్బును దోచుకెళ్లారు. బోనాలకు బియ్యం ఇవ్వాలని కోరుతూ ఇంట్లోకి ఇద్దరు మహిళలు వచ్చారు. ఇంటి యజమానురాలు రూప వారికి బియ్యం ఇచ్చింది.
అయితే, కథ దాంతో ముగిసిపోలేదు. వ్యాపారి శివరామప్రసాద్ రెడ్డి, రూప దంపతుల ఇంటికి సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు వచ్చారు. పోచమ్మకు బోనం పెడుతున్నాం, బియ్యం దానం చేయాలని అడిగారు. అయితే, ఇంట్లో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తీరడానికి తాము పూజ చేస్తామని నమ్మబలికారు.
పాపకు బాగుండాలని, మీకు సమస్యలున్నాయని మహిళలు చెప్పారు. తాము దిష్టి చేస్తామని చెప్పారు. దాంతో ఇంటి యజమానురాలు రూప చాప వరిచి, వారు చేయమన్నట్లుగా చేసింది. నిమ్మకాయలు, జాకెట్ ముక్క, చీర, నూనె ప్యాకెట్ వంటివి తెప్పించారు.
చివరకు డబ్బులు అడిగారు. రూప డబ్బులు లేవని చెప్పినా వారు వినలేదు. తమకు కనిపిస్తోందని, డబ్బులున్నాయని చెప్పారు. డబ్బు తిరిగి ఇస్తామని, తమకు అక్కరలేదని చెప్పారు. దాంతో తమ వద్ద ఉన్న 76 వేల రూపాయలు రూప వారి చేతిలో పెట్టింది. ఆ డబ్బును చీరలో చుట్టినట్లు చుట్టి పాపకు దిష్టి తీశారు. పాప స్నానం చేయాలని చెప్పారు.
తమతో పాటు రూపను గేటు వరకు రావాలని అడిగారు. నీళ్లు గేటు నుంచి ఇంటి లోపలి దాకా చల్లుకుంటూ వెళ్లాలని సూచించారు. దాంతో రూప నీళ్లు చల్లుకుంటూ లోనికి వెళ్లి చీర మూటను విప్పి చూసింది. డబ్బులు కనిపించలేదు. దాంతో మోసం జరిగిందని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు.
జరిగిన మోసంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళల కోసం గాలిస్తున్నారు. ఆ ఇద్దరి మహిళలు ఇంట్లోకి రావడం సిసిటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ రికార్డుల ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో వారి కోసం గాలిస్తున్నారు.