పొంగులేటికి తప్పిన ప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు టైర్లు!
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వెళుతుండగా తిరుమలాయపాలెం వద్ద ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కారు అదుపుతప్పింది.
అయితే, కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి తోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.

26 నుంచి రైతు భరోసా: పొంగులేటి
జనవరి 26 నుంచి అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల విధివిధానాలపై హన్మకొండలో ఐడీవోసీలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని పక్షంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటివిడతలో లబ్ధి చేకూరని వారికి తర్వాత విడతల్లో లబ్ధి చేకూరుస్తామన్నారు. అర్హత ఉండి ప్రజాపాలన యాప్లో నమోదు కానీ దరఖాస్తులు మాన్యువల్ గా నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.
గత ప్రభుత్వం కొండలకు గుట్టలకు కూడా రైతుబంధు ఇచ్చిందని.. తమ ప్రభుత్వం అలాంటి తప్పు చేయదన్నారు. సాకుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. జనవరి 16 నుంచి 26 వరకు గ్రామ సభలు పెట్టి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించవద్దన్నారు.












Click it and Unblock the Notifications