తెలంగాణలో రెండు రకాల యాగాలు..! ఒకటి ఆధ్యాత్మికం.. రెండోది రాజకీయం..!!
హైదరాబాద్ : తెలంగాణలో యాగం జరుగుతోంది.. కాదు కాదు.. యాగాలు జరుగుతున్నాయి. ఒకటి ఆద్యాత్మిక యాగం కాగా రెండోది రాజకీయ యాగం. రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఓ యాగం జరుగుతుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ని లేకుండా చేయాలనే యాగం మరోపక్క జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లానుండి తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపుకునేందుకు గులాబీ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఐతే సత్తుపల్లి నుండి గెలిచిన టీడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారేందుకు మొగ్గు చూపుతుండగా ఆశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు మాత్రం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
యాగం మొదలైంది...! తెలంగాణలో టీడిపి లేకుండా చేసే యాగం షురూ..!!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే టీఆర్ఎస్ ప్రణాళికకు తొలి అడుగు పడబోతుందా..? టీడీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే కారెక్కబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఏకపక్షంగా ప్రజలు అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ 88 నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. దీని తర్వాత ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
టీఆర్ఎస్ కు మెరుగైన ఆదిఖ్యం..! ఐనా టీడిపితో ఎప్పటికైనా ప్రమాదమే..!!
దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరుకుంది. అయినా.. ఆ పార్టీ అధినేత ‘‘ఆపరేషన్ ఆకర్ష్''ను మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇది రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతల కోసం కాదు.. కేవలం తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకునేందుకు మాత్రమే. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన టీడీపీ.. ఆ ఎన్నికల్లో 15 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత జరిగిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఆ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు దూరమయ్యారు.ఇక ఈ మధ్య జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి నుంచి 13 స్థానాల్లో బరిలోకి దిగిన టీడీపీ.. కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ రెండూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కావడం విశేషం.
టీఆర్ఎస్ లో చేరేందుకు సండ్ర సుముఖత..! ఆలోచిస్తున్న మెచ్చా..!!
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్రావు టీడీపీ నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఈ ఇద్దరినీ టీఆర్ఎస్లో చేర్చుకుని, తెలంగాణలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా చేయాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నేతలతో కారు పార్టీకి చెందిన ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నారు. సండ్ర.. తనతో పాటు మెచ్చాను కూడా టీఆర్ఎస్లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరు పార్టీ మారితే తెలంగాణలో చాప్టర్ క్లోజ్..! టీడిపి కనుమరుగైనట్టే..!!
అయితే, మెచ్చా మాత్రం తాను పార్టీని వీడేది లేదని తేల్చి చెబుతున్నారు. కానీ, సండ్ర మాత్రం టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారితే ప్రజలకు చెప్పే మారుతానని స్పష్టం చేశారు. ప్రగతిభవన్ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. పార్టీ మారడం, మారకపోవడం ముఖ్యం కాదు.. ప్రజల్లో ఉంటే గెలుస్తామని అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా సండ్ర.. సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. వీరిరువురూ సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ భేటీలో టీఆర్ఎస్లో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సీఎంకు హామీ కూడా ఇచ్చారని సమాచారం. దీనిపై సండ్ర రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నారనే చర్చ జరుగుతోంది.