పూజల పేరిట మోసం, భిక్షాటన: ఆ ఇద్దరు మాయాలేడీల అరెస్ట్
హైదరాబాద్: ఇంటికి పట్టిన దోషం తొలగిస్తామని, అమ్మవారికి నైవేద్యం పెడితే పాపాలు పోతాయని రూ.76వేలు అపహరించిన ఇద్దరు మహిళలను మాదాపూర్ క్రైం పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఫేక్ సర్టిఫికేట్, ఒక్కో దానికి ఒక్కో ధర: కిలేడీ అరెస్ట్మహిళలను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తొర్లికొండకు చెందిన కవిత(38), రాసూరి దేశమ్మ అలియాస్ లక్ష్మి(25) కొంతకాలం క్రితం నగరానికి వలసవచ్చారు.
ఈసీఐఎల్ సమీపంలోని సాకేత్పూర్లో ఉంటున్నారు. ఇళ్లకు తిరిగి భిక్షాటన చేయడం, పూజల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ నెల 11న మాదాపూర్ అమర్ సొసైటీ కాలనీలో నివాసం ఉంటున్న శివరామి రెడ్డి అనే వ్యాపారి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను మాటల్లో పెట్టి రూ.76వేల నగదుతో ఉడాయించారు. ఈ మాయలేడీల దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో వారి చిత్రాలను పోలీసులు విడుదల చేశారు.
గురువారం ఇద్దరు మహిళలను జూబ్లీబస్ స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో, వారు దొంగతనాలను అంగీకరించారు. ఇదే తరహాలో పలు మోసాలు చేసినట్లు తెలిపారు. వీరిని ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున నేరాలకు పాల్పడ్డారు.