కేటీఆర్వి అబద్ధాలే: పీఎం కార్యక్రమానికి హాజరుకావొద్దని పీఎంవో చెప్పలేదంటూ కేంద్రమంత్రి క్లారిటీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ మీడియాతో చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రధాని మోడీపై, పీఎంవోపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని చెబుతూ ట్వీట్ చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలు అబద్ధమంటూ కేంద్రమంత్రి
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ' ప్రధానమంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని పీఎంవో మంత్రి జితేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
పీఎంవో అలాంటి సందేశం పంపలేదు.. కేటీఆర్ పూర్తిగా అబద్ధాలు చెప్పారు: కేంద్రమంత్రి
'ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా చూడాలని ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్లు తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది పూర్తిగా అబద్ధం. పీఎంవో అలాంటి సందేశం ఏదీ పంపలేదు. వాస్తవానికి ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి హైదరాబాద్కు వెళ్లినప్పుడు, ఆయన కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని ఆశించాం. ఆరోగ్యం బాగాలేనందున ఆయన హాజరుకాలేకపోతున్నట్లు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించింది' అని జితేంద్రసింగ్ ట్వీట్లో వెల్లడించారు.
ప్రధాని మోడీ కార్యక్రమాలకు కేసీఆర్ గైర్హాజరు..
కాగా, ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. అనారోగ్యం వల్ల ప్రధాని కార్యక్రమానికి వెళ్లడంలేదని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ఓ ఆంగ్ల ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు భిన్నంగా మాట్లాడారని, మోడీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రధాని మోడీ పాల్గొన్న కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
పీఎంవో సందేశమంటూ కేటీఆర్ ఏమన్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోడీ సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చినప్పుడు స్వాగతించడానికి, వ్యక్తిగతంగా ఆతిథ్యం ఇవ్వడానికి కేసీఆర్ రాలేదని.. దీంతో చాలా మంది ఇది ప్రోటోకాల్ స్పష్టమైన ఉల్లంఘన అని అన్నారని కేటీఆర్ తెలిపారు.
అయితే, గత ఏడాది నవంబర్లో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ సదుపాయాన్ని సందర్శించడానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కనిపించలేదు. ఎందుకంటే.. ఈ రెండు సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి 'రావద్దు' అని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన సందేశం పంపిందని కెటి రామారావు చెప్పారు.
'' ఇదంతా పీఎంఓ ప్రొటోకాల్ ఉల్లంఘనలు కాదా, ఓ ముఖ్యమంత్రిని ప్రధాని అవమానించడం కాదా?'' అని కేటీఆర్ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడుతూ ప్రశ్నించారు.