Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభుత్వ నిర్లక్ష్యం:ఎరువుల కొరతతో..క్యూలైన్లో బడికెళ్లాల్సిన విద్యార్థి..!

నల్గొండ: ఖరీఫ్ సాగు చివరి దశకు చేరుకున్న ఈ కీలక సమయంలో, నల్గొండ, సూర్యాపేట జిల్లాల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, రైతుల కష్టాలను చూసి, తమ చదువులను పక్కనపెట్టి పాఠశాల విద్యార్థులు సైతం ఎరువుల కోసం పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

క్యూలైన్లో విద్యార్థి
సోమవారం ఉదయం,పాఠశాల విద్యార్థి పాయలి మిథిలేష్ యూరియా కోసం క్యూలో నిలబడి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఉదయం ఆరు గంటలకే మిర్యాలగూడ రోడ్డులోని నల్గొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ అవుట్‌లెట్ వద్దకు చేరుకున్న తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి..తన వంతు త్వరగా వచ్చేలా చూడమని అధికారులను,తోటి రైతులను వేడుకోవడం అక్కడ ఉన్న వారందరి హృదయాలను కదిలించింది. పాఠశాలకు వెళ్లాల్సిన సమయం అవుతుండటంతో,అతడు యూరియా కోసం పడిగాపులుకాశాడు.

urea-shortage-crisis-school-students-stand-in-queues-as-farmers-face-ruin-in-telangana

వారం రోజులుగా వేచి చూసినా యూరియా దొరకకపోవడంతో మిథిలేష్ తల్లిదండ్రులు, తమ కుమారుడిని పొలానికి అవసరమైన ఎరువుల కోసం పంపించారు. వ్యవసాయ పనుల ఒత్తిడిలో ఉన్న వారు, ఒకప్పుడు సులభంగా దొరికే యూరియా కోసం తమ కుమారుడిని నిలబెట్టక తప్పలేదు. అయితే, గంటల తరబడి వేచి చూసినా అతని వంతు వచ్చేసరికి స్టాక్ అయిపోయింది. దాంతో, చేతిలో సంచి పట్టుకొని ఖాళీగా వెనుదిరగాల్సి వచ్చింది. కన్నీళ్లతో బరువెక్కిన గొంతుతో మిథిలేష్, "నాన్నకు ఫోన్ చేసి యూరియా దొరకలేదని చెప్పాను. ఇప్పుడు స్కూల్‌కి లేట్ అవుతుంది," అని నిస్సహాయంగా అన్నాడు.

చదువులు వదిలి క్యూలలో.. చెప్పులు పెట్టి స్థానం రిజర్వ్
సూర్యాపేట జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.అనంతగిరి మండలం రైతులు యూరియా కోసం ఎంతగా ఆరాటపడుతున్నారంటే,ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ (PACS) కేంద్రాల వద్ద తమ స్థానాన్ని రిజర్వ్ చేసుకోవడానికి ఉదయం ఐదు గంటలకే చెప్పులు వరుసలో పెట్టి వెళ్తున్నారు.ఇది రైతుల ఆవేదనకు అద్దం పడుతోంది.సమయానికి ఎరువులు అందకపోవడంతో ఖరీఫ్ సీజన్‌లోని వరి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పంట నాట్లు పూర్తి చేసుకుని, రెండో విడత యూరియా వేయాల్సిన సమయం ఇది. ఈ సమయంలో సరఫరా లేకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

"వారం రోజులుగా ఒక షాపు నుంచి మరో షాపుకు తిరుగుతున్నాం, కానీ ఎక్కడా యూరియా దొరకడం లేదు. ఒక రైతుకు కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తామనడం అన్యాయం" అని క్యూలో నిలబడిన ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు.

వేలల్లో డిమాండ్.. వందల్లో సరఫరా
నల్గొండ,సూర్యాపేట జిల్లాల్లోనూ రైతులు గంటల తరబడి క్యూలలో గడుపుతూ,ఇతర పనులను వదిలేస్తున్నారు.సూర్యాపేట జిల్లాలో ఆగస్టు నెల డిమాండ్ 22,000 మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 2,300 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయింది.నల్గొండలో 70,000 మెట్రిక్ టన్నుల అవసరం కాగా..ఇప్పటివరకు 45,500 మెట్రిక్ టన్నులు మాత్రమే చేరింది.

పంట విస్తీర్ణం ఎంత ఉన్నా ఒక రైతుకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇవ్వాలనే నిబంధనలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."పెద్ద పొలాలకు ఒక బస్తా ఎలా సరిపోతుంది? మేము మా పంటలను వదిలేయాలా?" అని సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక రైతు ప్రశ్నించారు.ఈ కొరత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తూ రైతులు పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు.వెంటనే తగినన్ని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తొలకరి ఆశలతో పంటలు సాగు చేసి, ఇప్పుడు చేతికొచ్చిన పంటలు ఎండిపోయే ప్రమాదంతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అధికారులు, పాలకులు తమ వైపు చూడకపోతే తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని రైతులు భయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+