ఉత్తమ్ రాజీనామా, కానీ ఆ ప్రచారం నిజం కాదు
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను కలిసి రాజీనామా లెటర్ అందజేశారు. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా ఇదే విషయంపై చర్చించి .. నర్సింహాచార్యులకు రిజైన్ లెటర్ సమర్పించారు.
అబ్బే .. ఆ పదవీకి కాదు ..
వాస్తవానికి ఇవాళ ఉదయం నుంచి ఉత్తమ్కుమార్ రెడ్డి పీసీసీ పదవీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఎంపీగా ఎన్నికైనందున ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడినుంచి అతని సతీమణి ఉత్తమ్ పద్మావతి బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కోదాడలో పోటీచేసి .. మల్లయ్య యాదవ్పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తారు. దీంతోపాటు పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కొద్దిరోజుల ముందు శ్రీధర్ బాబు పీసీసీ చీఫ్గా, ఉత్తమ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవీ చేపడుతారని వార్తలు కూడా వినిపించాయి. దీనికి తగ్గట్టే బుధవారం జోరుగా ప్రచారం జరిగింది.
అన్నీ వైఫల్యాలే ..
ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవీ చేపట్టి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. కానీ రాష్ట్రంలో పార్టీకి ఆశించిన సీట్లు సాధించడంలో విఫలమవుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టకపోవడంలో అప్పటి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పదవీనుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తర్వాత పీసీసీ చీఫ్గా ఉత్తమ్ బాధ్యత స్వీకరించారు. కానీ డిసెంబర్లో అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయినా ఉత్తమ్ పదవీని పట్టుకొని ఉన్నారే కానీ .. రాజీనామా సంగతి ప్రస్తావించలేదు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడుసీట్లతో సరిపెట్టుకున్నారు. రాష్ట్రంలో అడ్రస్ లేని బీజేపీ 4 సీట్లు గెలుచుకోగా ... కాంగ్రెస్ మాత్రం ఒక్క ఆకు తక్కువే చదివింది.
స్థానిక ఎన్నికల్లోనూ ..
అంతేందుకు నిన్న వెలువడిన స్థానిక సంస్థల ఫలితాల్లో కూడా కారు టాప్ గేరులో దూసుకెళ్లింది. విపక్ష కాంగ్రెస్ ఆచూకీ కూడా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదు. ఆ పార్టీ గుర్తుపై గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం .. ఉత్తమ్ నాయకత్వ లోపానికి సజీవ సాక్ష్యం. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ను మార్చాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో నైతిన బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామాకు దిగారు. మిగతా ఇంచార్జీలు, పీసీసీ చీఫ్లు కూడా రాజీనామా చేశారు. మరి ఉత్తమ్ సంగతేంటని .. ఆయన వైరి పక్షం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. సో ఉదయం నుంచి ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేస్తారనే ఊహగానాలు వినిపించినా .. చివరికి ఆయన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు.