‘రూ. 10కోట్లు ఖర్చు చేస్తే.. ఆవు కథ చెప్పి వెళ్లిన మోడీ’
కరీంనగర్/మెదక్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట, కరీంనగర్ జిల్లా వీణవంకలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు తొలిసారిగా వచ్చిన భారత ప్రధానికి ఘన స్వాగతం పలికి, రూ. 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే..ఒక్క కొత్త పథకం కూడా ఇవ్వకుండా, చివర్లో ఆవు కథ చెప్పి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
ఇంత పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తారని అనుకుంటే, ఆ మాట కూడా ఆయన నోటి నుంచి రాలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఒక్క కచ్చితమైన హామీ కూడా ఇవ్వకుండా ప్రజలను తీవ్ర నిరాశలో ముంచెత్తారని దుయ్యబట్టారు. ప్రధాని రాకతో రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగలేదని, కేసీఆర్, మోడీలు ఒకరిని ఒకరు పొగడుకోవడానికే ఈ పర్యటన జరిగినట్టుందని అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నిధులు కేటాయించి.. నిర్మించిన మంచినీటి పథకాన్నే మోడీ ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను పీఎం, సీఎం కొత్తగా అమలు చేస్తున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం రూపకల్పన జరిగిందని, 90శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయని ఉత్తమ్ తెలిపారు. దానినే మోడీ జాతికి అంకితం చేశారన్నారు.
రామగుండం ఎరువుల కర్మగారానికి గతంలోనే రూ.10వేల కోట్లు మంజూరు చేశామని, కొత్తపల్లి-మనోహరాబాద్ రేల్వేలైన్ యూపీఏ హయాంలోనే మంజూరైందని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు.
హైకోర్టు, వరంగల్కు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఖమ్మం జిల్లాకు ఉక్కు కర్మాగారం, ఉద్యోగుల విభజనపై ప్రధాని వద్ద సీఎం ప్రస్తావించలేదని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి డి.శ్రీధర్బాబు, మాజీ ఎమ్మేల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, ఆరెపల్లి మోహన్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, తదితరులు పాల్గొన్నారు.