నా గురించి తెల్సుకొని మాట్లాడు: రాములమ్మ కౌంటర్, కేసీఆర్ తప్పులో కాలేశారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలకు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి గురువారం నాడు గట్టి కౌంటర్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు తెరాసలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాబును లాగి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, విజయశాంతి మాటేమిటని జానాకు ప్రశ్నజానారెడ్డి ఇప్పుడు చేరికల గురించి మాట్లాడుతున్నారని, కానీ తమ పార్టీ నుంచి విజయశాంతి, అరవింద్ రెడ్డిలను కాంగ్రెస్ తీసుకుందని, అప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ప్రశ్నించారు. దానికి రాములమ్మ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ దారిలో 'రాములమ్మ': విజయశాంతి చక్రం తిప్పేనా?తాను కుట్ర, అబద్దపు ప్రచారాల వల్లనే తెరాస నుంచి బయటకు వెళ్లవలసి వచ్చిందని, అయినా తాను తెరాసను వీడలేదని, కుట్రతో తనను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా తెరాస ఎంపీగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఎలా చేర్చుకుందని కేసీఆర్ ప్రశ్నించారని, ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని విజయశాంతి అన్నారు. తెరాస తనను 2013 జూన్ నెలలో పార్టీ నుంచి సస్పెండ్ చేసిందన్నారు.
తర్వాత ఎనిమిది నెలలుకు అంటే 2014 ఫిబ్రవరి నెలలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కుట్రల ఫలితమో, అబద్ధపు ప్రచారమో లేదా మరేదైన కారణమో తనను తెరాస నుంచి సస్పెండ్ చేశారన్నారు.
అయినా తాను ఏమీ మాట్లాడలేదని చెప్పారు. తనకు ఉన్న పౌరుషం, ఆత్మాభిమానం కారణంగానే తాను ఏ విధమైన వివరణా ఇవ్వలేదని చెప్పారు. ఎలాంటి అభ్యర్థనా చేయలేదన్నారు.
తాను, కేసీఆర్ తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం కలిసి పని చేశామని, తనపై ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తన గురించి ప్రస్తావించినప్పుడు పూర్తి సమాచారంతో, సమగ్రంగా పరిశీలించి మాట్లాడాలన్నారు.
కేసీఆర్ తప్పులో కాలేశారా?
విజయశాంతి విషయంలో కేసీఆర్ తప్పులో కాలేశారా అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ ఆమె పేరు ప్రస్తావించిన నేపథ్యంలో విజయశాంతి సరైన సమయంలో, సరైన విధంగా స్పందించారని అంటున్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు, జానా రెడ్డికి విజయశాంతిని చేర్చుకున్నప్పుడు తెలియదలేదా అని కెసిఆర్ మాట్లాడారు.
కానీ తెరాస నుంచి ఆమెను సస్పెండ్ చేశాకే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో, విజయశాంతి విషయంలో మాత్రం కేసీఆర్ తప్పులో కాలేశారని అంటున్నారు. మళ్లీ తెరాస నేతలు మాట్లాడని విధంగా విజయశాంతి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.