స్మార్ట్ హైవేగా విజయవాడ-హైదరాబాద్... నో యాక్సిడెంట్స్
విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారి నెం.65 ఇకనుంచి స్టార్ట్ హైవేగా మారబోతోంది. నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేయబోతున్నారు. సరిగ్గా చెప్పాలంటే హై సెక్యూరిటీ హైవేగా తీర్చిదిద్దబోతున్నారు. రహదారి పొడవునా ఏఐతో అనుసంధానమై ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని ఏపీ, తెలంగాణ పోలీసు శాఖ, రవాణా శాఖలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనం వివరాలు అందుబాటులో ఉంటాయి.
231 సీసీ కెమెరాలు
231 కిలోమీటర్ల పొడవునా సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు. అలాగే సీసీ కెమెరాలు 231 ఉంటాయి. సీసీ కెమరాలు మానిటరింగ్ కేంద్రాలను కూడా హైవేపైనే ఏర్పాటు చేస్తారు. అంతేకాదు హైవే పక్కన సెక్యూరిటీ కోసం బారికడ్లు ఉంటాయి. రోడ్డు మధ్యలో మొక్కలు, వర్షపు నీరు వృథా అవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి తెలంగాణలోని మల్కాపూర్ దగ్గర ఉన్న అంథోల్ మైసమ్మ ఆలయం వరకు ఆరు వరుసలుగా నిర్మాణం జరుపుకుంటుంది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా పూర్తయింది. పనులు ప్రారంభించడమే తరువాయి.

తర్వాత తవ్వే అవసరం లేదు
ఈ రహదారి పూర్తవడానికి 10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. నిధులు రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మూడేళ్లలో పనులు పూర్తికానున్నాయి. రహదారిపై ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, సంఘటన జరిగినా వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తెలిసిపోయేలా ఏర్పాట్లు ఉంటాయి. ఒకసారి రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరోసారి ఇతర అవసరాల కోసమని రోడ్డును తవ్వడం లాంటివేవీ ఉండవు. మంచినీటి సరఫరా, బోరు లైన్లు, హ్యాండ్ పంప్స్, గ్యాస్ పైపులైన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్లను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన 38 చోట్ల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications