దోపిడీ, అవినీతికి స్వేచ్ఛ కావాలంటున్నారు: చంద్రబాబుపై వినోద్ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి వినోద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దోపిడీకి, అవినీతికి స్వేచ్ఛ కావాలంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో ఉండేవారి శాంతి భద్రతలను సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కాపాడతారని చెప్పారు.
హైదరాబాద్లో ఉండే ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రాణభయం, స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయినప్పుడు మాత్రమే గవర్నర్ సెక్షన్ 8 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని వినోద్ చెప్పారు. అది కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రులను సంప్రదించిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
తీవ్రమైన అశాంతి నెలకొన్నప్పుడు మాత్రమే గవర్నర్ తన స్వయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేదని, ఇక్కడ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు. ఏపి సిఎం, చంద్రబాబునాయుడు, మంత్రులు చెప్పినట్లు సెక్షన్ 8 అమలు కాదని అన్నారు.

హైదరాబాద్లో ఎవరికీ భయం లేదని, ఎవరిపైనా దాడులు జరగలేదని, విద్వేషపూరిత వాతావరణం కూడా ఏమి లేదని అన్నారు. ఎవరి ఆస్తులకు భంగం వాటిల్లలేదని చెప్పారు. సెక్షన్ 8 ప్రకారం.. నీతి, నిజాయితీకి స్వేచ్ఛ ఇవ్వాలి కానీ, అవినీతికి, దోపిడీకి కాదని అన్నారు.
దోపిడీకి, అవినీతికి ఇక్కడ స్వేచ్ఛ లేదని వినోద్ అన్నారు. చంద్రబాబునాయుడు దోపిడీకి, అవినీతికి పాల్పడతానంటే స్వేచ్ఛ ఎలా ఇస్తారని వినోద్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని, చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఎంపి వినోద్ అన్నారు. సెక్షన్ 8ను కేంద్రం కూడా అమలు చేస్తోందని అనుకోవడం లేదని చెప్పారు. ఏపి సిఎం చంద్రబాబుకు నోటీసులిచ్చే అధికారం తెలంగాణ ఏసిబికి లేదని ఏపి మంత్రులు అమాయకుళ్లా మాట్లాడుతున్నారని అన్నారు.
ఏపి మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్నా శాంతి భద్రతలు పోలీసుల చేతిలోనే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన పరిస్థితి, అవసరం లేదని ఎంపి వినోద్ చెప్పారు.












Click it and Unblock the Notifications