మధ్యప్రదేశ్లో బీఆర్ఎస్ ఎంట్రీ- కండువా కప్పుకొన్న వ్యాపం హీరో..!!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి క్రమంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంటోంది. ఇప్పటికే ఏపీలో అడుగు పెట్టింది. అటు మహారాష్ట్రలో ఎంట్రీ ఇచ్చింది. కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన నేపథ్యంలో కేసీఆర్- దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు.
ఊహించిన దాని కంటే వేగంగా ఏపీ, మహారాష్ట్రల్లో అడుగు పెట్టింది బీఆర్ఎస్. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనాలను సృష్టిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని నాందెడ్ సహా కంధార్ లోహా, ఔరంగాబాద్లో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. తన లక్ష్యం ఏమిటో వివరించారు.

మహారాష్ట్రలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమతా పార్టీ, భీమ్ ఆర్మీ సేన, రివాల్యూషనరీ పార్టీ ఆఫ్ ఇండియా, స్వాభిమాన్ మంచ్, కామ్ఘర్ అఘాడీ వంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో కండువాను కప్పుకొన్నారు. రైతు సంఘాల నాయకులూ గులాబీ జెండాను భుజానికెత్తుకున్నారు.

బీఆర్ఎస్ కార్యకలాపాలు ఇక తాజాగా మధ్యప్రదేశ్కు కూడా విస్తరించాయి. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ఇవ్వాళ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు. వ్యాపం కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన డాక్టర్ ఆనంద్ రాయ్ సైతం బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆయనకు గులాబీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతిపెద్ద కుంభకోణం వ్యావసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం). మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన వ్యాపం కుంభకోణం ఇది. దీన్ని ఆనంద్ రాయ్ బయటపెట్టారు. ఇప్పుడాయన బీఆర్ఎస్తో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు కీలక పదవి లభించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications