చంద్రబాబు విషయంలో రేవంత్ రెడ్డికి హెచ్చరిక?
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి బిఆర్ఎస్ పార్టీ నుండి నేతలు వలస బాట పట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తల నుండి అసహనం వ్యక్తం అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్, టీడీపీ సీఎంల కలయికతో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు సలహాలు, సూచనలతో చాలామంది నేతలు పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ పుట్టిన రోజున షాకింగ్ ఫ్లెక్సీ
అంతేకాదు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, టిడిపి కూటమి సీఎం చంద్రబాబు ఇద్దరూ ఒకటే అన్నట్టు చర్చ జరుగుతుంది. తాజాగా కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పుట్టినరోజు సందర్భంగా వెలసిన పోస్టర్లపై ఓవైపు చంద్రబాబు ఫోటో, మరోవైపు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకరికొకరు అంటకాగుతున్నారని అసహనం వ్యక్తం అవుతుంది.

సోషల్ మీడియాలో రేవంత్ టార్గెట్ గా పోస్టులు
దీంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపులో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకున్న వారికి విలువ ఇవ్వండి.. బ్రతకడానికి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి కాదు అంటూ, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు ఇవ్వాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
కాంగ్రెస్ లో టీడీపీలో పని చేసిన వారు, చంద్రబాబు శిష్యులు
గతంలో టీడీపీలో పని చేసిన వారిని, చంద్రబాబు శిష్యులను కాంగ్రెస్ లో చేర్చుకుని, కాంగ్రెస్ నే నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారనిసోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 64 స్థానాలను కట్టబెట్టి అధికారాన్ని ఇచ్చారని, మీరు తీసుకునే నిర్ణయాలతో మళ్ళీ గత ప్రభుత్వానికి పట్టిన గతే మన ప్రభుత్వానికే పట్టేలా ఉందని సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల వార్నింగ్.. పోస్టులు
బండిలో పెట్రోల్ లేకున్నా, మూడు పూట్ల తిండి లేకున్నా, పదేళ్ల అరాచకంపై పోరాటం చేస్తే కేసులు పెట్టినా, ఇళ్లకు వచ్చి బెదిరించిన తట్టుకున్నామన్నారు. మన పాలనలో సంతోషంగా ఉంటామని భావించామని, కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసామో వాళ్లనే పార్టీలో చేర్చుకుంటున్నారని పేర్కొని, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోస్టులు పెడుతున్నారు.
రేవంత్ కు హెచ్చరిక
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించి నిర్ణయాలు మార్చుకోవాలని లేదంటే గత ప్రభుత్వానికి పట్టినగతే పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications