తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. హైకోర్టులో సవాల్ చేసే యోచనలో కాంగ్రెస్!
తెలంగాణలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న కసితో ఉంది. ఇందుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేత్రుత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహ రచనపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరును ఆయన తప్పు పట్టారు. ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ రిజర్వేషన్ల ప్రకటనకు నామినేషన్ల దాఖలుకు మధ్య కేవలం ఒక్కరోజు గడువు మాత్రమే కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు.
జనవరి 6న రిజర్వేషన్స్ ప్రకటిస్తే.. 8వ తేదీనే అభ్యర్థులను ఎలా ఖరారు చేయగలుగుతామని ఈసీని ప్రశ్నించారు. విపక్షాలు అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా అధికార పార్టీకి మేలు చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఎన్నికల విషయానికొస్తే.. ఈసారి మున్సిపల్ పోరులో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుంటన్నారు. అర్భన్ ఏరియాల్లో టీఆర్ఎస్,బీజేపీల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీ దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంటే.. టీఆర్ఎస్ మున్సిపాలిటీల్లో సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఏ మున్సిపాలిటీని టీఆర్ఎస్ అభివృద్ది చేయలేదని విమర్శించారు.
నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ప్రకటిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు దాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. కాబట్టి యువతకు నిరుద్యోగ భృతి కావాలంటే టీఆర్ఎస్ను ఓడించాలన్నారు. అలాగే మున్సిపాలిటీల్లో ఉండే రైతులు కూడా టీఆర్ఎస్కు ఓటు వేయవద్దన్నారు. రైతు రుణమాఫీ అమలు కావాలంటే, రైతు బంధు పూర్తి స్థాయిలో అమలుకావాలంటే టీఆర్ఎస్ను ఓడించాల్సిందే అన్నారు. ఇక టీపీసీసీ చీఫ్ మార్పును హైకమాండ్ నిర్ణయిస్తుందని.. అయినా మున్సిపల్ ఎన్నికల్లో దాని ప్రభావమేమీ ఉండదని పేర్కొన్నారు.