ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీపై కేసీఆర్-కేటీఆర్ మనసులో మాట- కవిత నోట..!!
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత- ఇవ్వాళ మీడియాతో ముచ్చటించారు. పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించీ చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాలపైనా తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై ఘాటు విమర్శలను సంధించారు.
బండి సంజయ్పై కౌంటర్ అటాక్..
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై కవిత ఎదురుదాడికి దిగారు. తనపై చేసిన కామెంట్స్ బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ స్థాయి నాయకులు సైతం మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానిస్తుంటారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనికి మినహాయింపు కాదని విమర్శించారు. మోదీ నుంచి బండి సంజయ్ వరకు బీజేపీలో అన్ని స్థాయిల్లో ఉండే నాయకులందరూ మహిళలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుంటారని ఆరోపించారు.
మహిళలంటే చులకన..
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి అవమానించారని పేర్కొన్నారు. మమతా బెనర్జీని ప్రధాని మోదీ, తనను బండి సంజయ్ కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం- మహిళకు వారు ఇచ్చే విలువ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చని కల్వకుంట్ల కవిత చెప్పారు.
ప్రత్యామ్నాయంగా..
టీఆర్ఎస్.. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడాన్ని బీజేపీ నాయకులు భరించలేకపోతోన్నారని ఎద్దేవా చేశారు కవిత. ఆ పార్టీ నాయకులకు కళ్లు మూసినా తెరిచిన కేసీఆరే కనిపిస్తోన్నారంటూ చురకలు అంటించారు. తమకు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఆవిర్భవించిందనే ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. అందుకే- మహిళలని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ రాకతో..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ మీద బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తే వారి మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని కవిత అన్నారు. బతుకమ్మను ఎత్తుకోవడానికి కూడా భయపడ్డ వాళ్లు ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తనను మాత్రమే కాకుండా బతుకమ్మను సైతం కించపరిచినట్టయిందని కవిత చెప్పారు. బీఆర్ఎస్ రాకతో బీజేపీ నాయకులకు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుందని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాలకు వ్యతిరేకం..
బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా ఆవిర్భవించాలనే సత్సంకల్పంతో యజ్ఞ యాగాదులను నిర్వహిస్తోన్నామని కవిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, అన్ని రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల మద్దతు లభిస్తోందని చెప్పారు. ఏపీ నుంచి కూడా చేరికలు ఉండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. తాము ఏపీ రాజకీయాలు, అక్కడి నాయకులకు మాత్రమే వ్యతిరేకమని, ఆ రాష్ట్ర ప్రజలకు కాదని కవిత స్పష్టం చేశారు. ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ విస్తరిస్తుందని అన్నారు.
హ్యాట్రిక్ సాధిస్తాం..
వచ్చే ఎన్నికల్లో మరోసారి తమ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరే తమను గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖం చూసో.. లేక తెలంగాణ సెంటిమెంట్ను చూసో ప్రజలు ఓట్లేయబోరని తేల్చి చెప్పారు. మెరిట్తో హ్యాట్రిక్ కొట్టబోతోన్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల లబ్దిని పొందిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటారని ఆమె వివరించారు.
నిర్మల సీతారామన్పై ఫైర్..
లోక్సభలో నిర్మలా సీతారామన్- రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వివాదంపై కవిత స్పందించారు. హిందీ భాషా వీక్గా ఉందంటూ రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేయడం కాదని.. రోజురోజుకూ బలహీనపడుతున్న రూపాయి గురించి ఆమో మాట్లాడాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర బకాయిలు విడుదల కాకుండా నిర్మల సీతారామన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకూ అనేక రకాల బకాయిలను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు.