మర్కజ్ లేకుంటే ఒక్క కేసు ఉండేది కాదు: కరోనాకు ఫార్ములా లేదు, అదే మందు: కేటీఆర్
హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని, రాబోయే రెండు వారాలు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ సహా పలు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు.

కరోనాకు అదే మందు..
వేములవాడ కంటైన్మెంట్ ప్రాంతం సహా ముస్తాబాద్ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. పలుచోట్ల స్థానికులతో మంత్రి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాకు ఒక ఫార్ములా అంటూ లేదని, సోకకుండా చూసుకోవడమే మేలని అన్నారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే మందు అని, రానున్న రెండు వారాలు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మర్కజ్ లేకుంటే ఒక్క కేసూ ఉండేది కాదు..
ఢిల్లీ మర్కజ్ ఘటన లేకపోతే జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. వేములవాడలో ఓ యువకుడికి కరోనా సోకిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారని చెప్పారు. కాగా, ఆ యువకుడితో సన్నిహితంగా మెలిగిన 21 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు మంత్రి తెలిపారు. వేములవాడలో ఒక్క కేసు మాత్రమే నమోదైందని, కంటైన్మెంట్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
74 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు
భారతదేశ ధాన్యాగారం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం 40 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండించారని తెలిపారు. కనీస మద్దతు ధర ఇచ్చి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని 88 శాతం మందికి పంపిణీ చేశామని, బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు రూ. 1500 చొప్పున నగదు జమ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 74 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.
వారికి ప్రత్యేక శిబిరాలు..
తెలంగాణ అభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాములని, వారిని ఆదుకుంటున్నామని మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వలస కూలీలకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 55 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వలస కార్మికులకు జిల్లాల కేంద్రాల్లోనూ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications