40 ఏళ్ల కష్టానికి పార్టీ కేడర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్..!!
తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్లు పూర్తయింది. ఎన్టీఆర్ శత జయంతి జరుపుకుంటున్నారు. ఈ సమయంలో తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు..ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీనే నమ్ముకొని ఉన్న వారికి టీడీపీ అధినేత చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. స్కిల్ స్కాంలో 50 రోజులకు పైగా జైలులో ఉన్న చంద్రబాబు అక్కడ నుంచే పార్టీకి ఇచ్చిన ఈ గిఫ్ట్ సంచలనంగా మారింది. ఎక్కడైతే పార్టీ పుట్టిందో అక్కడే పార్టీ ఉనికికే ఈ నిర్ణయం సవాల్ గా మారుతోంది.
చంద్రబాబు నిర్ణయంతో:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. నాలుగున్నార దశాబ్దాల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ కేడర్ కు రుచించటం లేదు. ఏపీలో అధికార లక్ష్యం..వ్యూహాల పేరుతో తెలంగాణలో పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నాలుగు దశాబ్దాల పార్టీగా టీడీపీ పోటీ చేయకపోవటం ఒక కారణమైతే..ఈ నిర్ణయం వెనుక లోపాయి కారీ నిర్ణయాలు ఉన్నాయంటూ స్వయంగా కాసాని లాంటి వారు చేస్తున్న ఆరోపణలు పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.

కేడర్ లో అసహనం:ఎన్టీఆర్ హైదరాబాద్ గడ్డ పైనే టీడీపీని ప్రకటించారు. అక్కడే పార్టీ తొలి బహిరంగ సభలు నిర్వహించారు. సంక్షోభాల సమయంలో టీడీపీకి హైదరాబాద్ పోరాట వేదికగా నిలిచింది. తెలంగాణలో టీడీపీ ఆవిర్భావం నుంచి అన్ని వర్గాల మద్దతు లభించింది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ నాయకత్వం పూర్తిగా ఏపీకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే, ఏపీ ప్రజలు 2014 అధికారం కట్టబెట్టినా..తిరిగి అధికారం 2019లో నిలబెట్టుకోవటంలో టీడీపీ నాయకత్వం విఫలమైంది. 23 సీట్లకు పరిమితం అయింది. తిరిగి పవన్ కల్యాణ్ తో కలిస్తే కానీ జగన్ తో పోటీ పడలేని పరిస్థితిలో ఉంది. బీజేపీ తీరు స్పష్టంగా ఉన్నా.. ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఢిల్లీ ఒప్పందాల మేరకే తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. జనసేన ఇక్కడ బీజేపీతో పొత్తులో ఉంది. ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైంది. ఈ రకమైన పొత్తుల లెక్కలను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా..వారిని ఒప్పించగలుగుతారా అనేది మరో చర్చ.
ఏపీలో ఎలా కలిసి వస్తుంది:తెలంగాణలో ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని..కేడర్ ను తాకట్టు పెట్టటం అనైతికం అంటూ కాసాని తన రాజీనామా లేఖలో స్పష్టం చేసారు. తెలంగాణ ఎన్నికల కోసం బాలకృష్ణ,లోకేష్ ను సంప్రదించినా స్పందించలేదని చెప్పుకొచ్చారు. వైఎస్సార్టీపీ, ప్రవీణ్ కుమార్ పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తుంటే టీడీపీ తప్పుకోవటం ఆ కేడర్ ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. చంద్రబాబును..టీడీపీ కోసం పని చేసిన కేడర్.. మద్దతు దారులు ఇప్పుడు మరో పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ లో రాజకీయ లక్ష్యం కోసం తెలంగాణలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నా..ఏపీలో టీడీపీ భవిష్యత్ ఏంటనేది అంతు చిక్కని అంశంగా మారుతోంది. పార్టీ కోసం నాలుగు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్న పార్టీ లీడర్స్.. కేడర్ కు అధినేత ఇచ్చే రిటర్న్ గిఫ్ఠ్ ఇదేనా అనే చర్చ పార్టీలో మొదలైంది.












Click it and Unblock the Notifications