హైదరాబాద్లో మరో అంతర్జాతీయ స్టేడియం: కొత్త స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్
హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను సీఎం రేవంత్ వివరించారు. ఇందులో భాగంగా త్వరలో నూతన క్రీడా విధానం తేబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
స్పోర్ట్స్ పాలసీకి హర్యానా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని రేవంత్ తెలిపారు. అంతేగాక, హైదరాబాద్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించినట్లు సీఎం తెలిపారు. క్రీడల కోసం బడ్జెట్లో రూ.321 కోట్లు కేటాయించామన్నారు. స్పోర్ట్స్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు.

భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్కు ఆర్థిక సాయం చేసి ఇంటిస్థలం కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే క్రికెటర్ సిరాజ్కు విద్యార్హత లేకున్నా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చదువులోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని కుటుంబం గౌరవం పెరుగుతుందని సీఎం రేవంత్ చెప్పారు.
హైదరాబాద్లో గతంలో క్రీడల కోసం నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుందని, అందుకు అందరి మద్దతు అవసరమని కోరారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications