హుజురాబాద్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది-ఎవరి దారి వారిదే-కౌశిక్ రెడ్డి కారెక్కడం ఖాయమేనా..?
హుజురాబాద్ కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కుతుందా దక్కదా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ సుముఖంగా లేరన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి కారెక్కడానికి సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డికి ఏ హామీ లభించింది... హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన్ను ప్రకటించే అవకాశం ఉందా...
ఆ సమయంలో పార్టీ లైన్ దాటారా?
హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్ 60వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై ఆయన చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఆరోపణలు,విమర్శల్లో మరింత దూకుడు పెంచారు. అయితే ఓవైపు ఈటలతో పార్టీ సంప్రదింపులు జరుపుతుండగానే కౌశిక్ రెడ్డి ఆయనపై ఇలా ఆరోపణలతో విరుచుకుపడటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కౌశిక్ రెడ్డి పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలకు తావిచ్చింది.
రేవంత్కు నమ్మకం కుదరట్లేదా?
టీఆర్ఎస్ డైరెక్షన్లోనే కౌశిక్ రెడ్డి ఈటలపై ఆరోపణలు గుప్పించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దానికి తోడు ఓ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి కేటీఆర్ను కలవడం ఆయన టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం ఈ ప్రచారాలను కొట్టిపారేశారు. కేటీఆర్ను కలవడం యాధృచ్చికంగా జరిగిందే తప్ప అందులో రాజకీయానికి తావు లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఆయనపై నమ్మకం కుదరట్లేదన్న ప్రచారం సాగుతోంది. అందుకే కౌశిక్ రెడ్డికి బదులు పొన్నం ప్రభాకర్కు టికెట్ ఇచ్చే యోచనలో రేవంత్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ముహూర్తం ఖరారైందా?
ఇప్పటికీ కౌశిక్ రెడ్డి తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెబుతున్నారు. అయితే మారుతున్న పరిణామాలను గమనిస్తే... కౌశిక్ రెడ్డి ఏ క్షణమైనా కారెక్కవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. జులై 15న ఇందుకు ముహూర్తం ఖరారైందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతోనే ఆయన పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అటు టీఆర్ఎస్ పార్టీ కూడా కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. నామినేటెడ్ పదవి హామీతోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడానికి సిద్దమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recommended Video
తలో దారి అన్నట్లుగా...
హుజురాబాద్ కాంగ్రెస్ పరిస్థితి తలో దారి అన్నట్లుగా ఉంది. ఓవైపు కౌశిక్ రెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతున్న వేళ... మరోవైపు కింది స్థాయి నేతలు,కార్యకర్తలు కూడా పార్టీలు మారుతున్నారు. నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇద్దరు ఎంపీటీసీలు,ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపఎన్నిక నాటికి కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే గత ఎన్నికల్లో 60 వేల ఓటు బ్యాంకు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది. రేవంత్ పగ్గాలు చేపట్టాక జరగబోతున్న ఉపఎన్నిక కావడంతో ఆయన నాయకత్వానికి కూడా ఇదొక పరీక్ష లాంటిదే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు హుజురాబాద్లో కనీసం డిపాజిట్ సంపాదించాలని ఇప్పటికే సవాల్ విసిరారు. ఒకవేళ అక్కడ డిపాజిట్ కోల్పోతే రేవంత్ నాయకత్వంపై విమర్శలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ను రేవంత్ ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలి.