ఆఫీస్కని వెళ్లి..: హైదరాబాద్లో కర్నాటక మహిళా టెక్కీ అదృశ్యం
హైదరాబాద్: సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న యువతి ఒకరు అదృశ్యమైన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఈ మేరకు నగరంలోని గచ్చి బౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె టిసిఎస్లో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కర్నాటక రాష్ట్రానికి చెందిన అనుశ్రీ అనే యువతి హైదరాబాదులోని టీసీఎస్లో పని చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు ఉదయం కార్యాలయానికి అని వెళ్లిన ఆమె అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి కనిపించడం లేదు.
దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి స్నేహితులు, ఇతరులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుశ్రీ అదృశ్యమైందనే ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆమె స్నేహితులను విచారిస్తున్నారు. ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది? వెళ్లేందుకు గల కారణాలు ఏమైనా తెలుసా? తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
సోమవారం ఉదయం ఏం జరిగిందంటే... అనుశ్రీ (22) టిసిఎస్ ఆదిభట్ల బ్రాంచులో పని చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. సోమవారం నాడు ఆమె తనకు ఆరోగ్యం బాగా లేదని తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. తాను హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ తీసుకు వెళ్తానని, కంగారు పడవద్దని తండ్రి చెప్పారు.
అనంతరం అనుశ్రీకి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో ప్రభాకర్ కర్నాటక నుంచి హైదరాాద్ వచ్చారు. హాస్టల్లో విచారించారు. అనుశ్రీ ఆఫీస్ వెళ్తున్నట్లు చెప్పారని తెలిపారు. దీంతో ఆయన టీసీఎస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడకు కూడా అనుశ్రీ రాలేదు. దీంతో తండ్రి ప్రభాకర్ పోలీసులను ఆశ్రయించారు.