వైఎస్ షర్మిల దీక్షా: తమకు డబ్బులు ఇవ్వలేదంటూ కార్మికుల ఆందోళన
హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఆందోళనకు దిగారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వటేదని దీక్షా స్థలి వద్దే నిరసన తెలిపారు.
దీక్షలో కూర్చుంటే రూ. 400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. తీర వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. కాగా, మంగళవారం వైఎస్ షర్మిల చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం గమనార్హం. షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలావుంటే, వైఎస్ షర్మిల కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం ప్రకటించారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి తన పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. పాదయాత్ర చేవెళ్లలో ప్రారంభించి చేవెళ్లలోనే ముగించనున్నట్లు షర్మిల్ వెల్లడించారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించనున్నట్లు ఆమె తెలిపారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. పాదయాత్రకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్న షర్మిల.. ఆయన ఆశయాలను సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. కాగా, గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు కొనసాగింపుగా.. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల. ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. తాజాగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గతంలో చేవేళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించారని తెలిపారు. ఆయన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో దోహదం చేసింది.
ఇక, వైఎస్ షర్మిల కూడా తన తండ్రికి కలిసివచ్చిన చేవెళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నారు.. అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న షర్మిల యాత్ర.. ఏడాది పాటు కొనసాగుతుందని.. మళ్లీ చేవేళ్లలోనే ముగిస్తామని వెల్లడించారు. మొత్తం 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.. తెలంగాణలో అన్ని పార్టీలు అమ్ముడు పోయాయని ఆరోపిస్తున్న వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొస్తున్నారు. పాదయాత్రలో బ్రేక్లు ఉండవని ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో ఈ పాదయాత్రతో కలిగిస్తామన్నారు వైఎస్ షర్మిల. ఏడేళ్ళల్లో కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశారని, కేసీఆర్ సీఎం ఆయిన తర్వాత దళితులపై దాడులు 800శాతం పెరిగాయని అన్నారు. మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని, బంగారు తెలంగాణ బారుల, బీరుల తెలంగాణ అయ్యిందని విమర్శించారు. కొత్త కొలువులు ఉండవని, ఉన్న వాటికి భరోసా లేదని విమర్శిచంచారు. గత ఏడేళ్ళల్లో ఏడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రతి పల్లెకు వెళతాం.. ప్రతి గడపా తడతాం.. అని షర్మిల తెలిపారు. కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్ ఎలా అమ్ముడుపోయాయో పాదయాత్రలో చెబుతామన్నారు.
ఇప్పటికే నిరుద్యోగ దీక్ష పేరుతో ప్రతి మంగళవారం ఉద్యోగాల కోసం ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను పరామర్శిస్తూ ఆయా గ్రామాలు, పట్టణాల్లో దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications