అర్ధరాత్రి 25 ఏళ్ల యువతి.. నగ్నంగా రోడ్డుపై పరుగులు, చెరువులో తేలిన శవం
చీకటి ముసిరిన అర్ధరాత్రి వేళ.. ఊరంతా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. సమయం సరిగ్గా 2:30 గంటలు. ఆ వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇంట్లో సైలెంట్గా అడుగులు పడ్డాయి. ఆ కదలికల్లో ఏదో తెలియని ఆందోళన.. కళ్లల్లో ఏదో అదృశ్య రూపం చూసినంత భయం! కన్నతల్లి నిద్రిస్తున్న గది తలుపులను ఆ నీడ బయట నుంచి మెల్లగా గడియ పెట్టింది.
ఇంటి బయటకు వచ్చి ఒంటిపై నూలుపోగు లేకుండా, చేతిలో కేవలం ఒక చీరను మాత్రమే పట్టుకుని రోడ్డుపైకి పరుగు లంకించుకుంది. పిచ్చిగా ఊగిపోతూ, రోడ్డు పక్కనే ఉన్న బీరప్ప గుడి ముందు ఒక్క క్షణం ఆగింది. దేవుడికి తలవంచి మొక్కింది. అంతే.. మళ్లీ గాల్లోకి లేచిన బాణంలా పరుగెత్తింది. నిమిషాల వ్యవధిలోనే సమీపంలోని చెరువు నీటి తుంపరలు పైకి లేచాయి. ఒక నిండు ప్రాణం ఆ నిశ్శబ్ద జలాల్లో కలిసిపోయింది! మరుసటి రోజు ఉదయం సీసీటీవీ ఫుటేజ్ చూసేవరకు ఎవరికీ అర్థం కాలేదు.. అక్కడ అసలేం జరిగిందో!

25 ఏళ్ల తేజస్విని...
ఈ షాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి సీన్ ఏదో సినిమాలోది కాదు.. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఒక హృదయవిదారక యదార్థ గాధ. ఈ మిస్టరీ వెనుక ఉన్నది 25 ఏళ్ల తేజస్విని అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్. విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన ఈమె, బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా నెలకు లక్షల్లో జీతం సంపాదించేది. అందరూ ఆమె కెరీర్ చూసి ఈర్ష్య పడ్డారు.
కానీ, ఆ రంగుల ప్రపంచం వెనుక, కోడింగ్ ల్యాప్టాప్ల స్క్రీన్ల వెనుక ఒక భయంకరమైన మానసిక ఒత్తిడి ఆమెను వెంటాడుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ టెన్షన్ తట్టుకోలేక ఆరు నెలల క్రితమే జాబ్ వదిలేసి విశాఖపట్నం వచ్చేసింది. కూతురి మైండ్ రిలాక్స్ అవుతుందని తల్లి అరుణ ఆమెను తీసుకుని రెండు నెలల క్రితం హైదరాబాద్ పీర్జాదిగూడకు మారింది. అంతా ప్రశాంతంగా మారుతోంది అనుకున్న తరుణంలోనే.. ఈ ఘోరం జరిగిపోయింది.
చెరువులో విగతజీవిగా..
శుక్రవారం సాయంత్రం వరకు మియాపూర్లో మరో ఇల్లు అద్దెకు తీసుకోవడం కోసం తల్లీకూతుళ్లు తిరిగారు. రాత్రి అలసిపోయి పడుకున్నారు. కట్ చేస్తే.. తెల్లవారేసరికి అరుణ ఉన్న గదికి బయట నుంచి తాళం వేసి ఉంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచారు. కానీ అప్పటికే తేజస్విని కనిపించకుండా పోయింది. కంగారుగా ఊరంతా వెతికిన కుటుంబ సభ్యులకు.. చివరకు పీర్జాదిగూడ చెరువులో తేజస్విని విగతజీవిగా కనిపించడంతో గుండె పగిలిపోయింది.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైడ్రా, డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సీసీటీవీ విజువల్స్ చూసిన పోలీసులకు సైతం మైండ్ బ్లాంక్ అయింది. అసలు తేజస్విని అంతలా భయపడటానికి కారణం ఏంటి? అర్ధరాత్రి గుడిలో మొక్కి చెరువులో ఎందుకు దూకింది? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి.
ఫియర్ ఫోబియా..
పోలీసుల ప్రాథమిక విచారణలో అసలు నిజం బయటపడింది. తేజస్విని గత కొంతకాలంగా తీవ్రమైన 'ఫియర్ ఫోబియా'తో బాధపడుతోందని, రాత్రి వేళల్లో భయంకరమైన పీడకలలు వస్తున్నాయని తల్లి పోలీసులకు తెలిపింది. ఆ మానసిక ఆందోళన, తెలియని అభద్రతా భావమే చివరకు ఆమెను అంతటి ఘోరమైన నిర్ణయానికి పురిగొల్పాయని పోలీసులు తేల్చారు. ఒక ఉన్నత విద్యావంతురాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇలా మానసిక ఒత్తిడికి బలైపోవడం నగరంలో తీవ్ర సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications