సిబిఐ కేసు తేలేదాకా అక్కర్లేదు: 'ఆలస్యం చేసేందుకే జగన్ పిటిషన్లు'
హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వైయస్ జగన్ బృందం విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈడీ పేర్కొంది. ఈ మేరకు కోర్టులో ఈడి తమ వాదనలను వినిపించింది. విచారణ జరగకుండా జాప్యం చేసేందుకే జగన్, విజయ సాయి రెడ్డిలు యత్నిస్తున్నారని సోమవారం తెలిపింది.
ఒకసారి తిరస్కరించిన అంశంపై మళ్లీ అదేవిధమైన పిటిషన్ దాఖలు చేయడంలో జగన్ సహా నిందితుల ప్రధాన ఉద్దేశం జాప్యం చేయడానికేనని ఈడీ పేర్కొంది.
సిబిఐ కేసు తేలేదాకా ఈడీ ఫిర్యాదుపై విచారణను వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని, దీన్ని కొట్టివేయాలని కోరింది. 2015 ఏప్రిల్ నుంచి ఇలాంటి వ్యర్థ పిటిషన్లతో విచారణ జరగకుండా సాగదీస్తున్నారని పేర్కొంది.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో టిఆర్ కన్నన్, మాధవ్ రామచంద్రన్, ఎకె దండమూడిలు జగతిలో పెట్టిన రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సిబిఐ కేసు తేలేదాకా మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఫిర్యాదుపై విచారణను వాయిదా వేయాలని జగతి పబ్లికేషన్స్, జగన్, విజయసాయిరెడ్డిలు ఈడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వేర్వేరుగా దాఖలైన ఈ పిటిషన్లపై సోమవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి రజని విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సిబిఐ కేసును బదిలీ చేయాలన్న ఈడీ అభ్యర్థనను సిబిఐ కోర్టు తిరస్కరించిందన్నారు.
అందువల్ల సిబిఐ కోర్టులో కేసు అపరిష్కృతంగా ఉండగా ఇక్కడ కేసును విచారణ చేపట్టరాదని కోరారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పారదర్శకమైన విచారణకు నిందితులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. అనంతరం కేసును 29వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications