YS Sharmila:తండ్రి ముద్ర కోసం తపన: నాడు చుడీదార్ -నేడు చీరకట్టు..సంథింగ్ స్పెషల్
వైయస్ షర్మిలా... తెలంగాణలో మరో రాజకీయ పార్టీతో ముందుకొస్తున్న నాయకురాలు. ఇటు అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా గతంలో తన తండ్రి వైయస్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు సీఎంగా పనిచేశారు. కాబట్టి వైయస్ షర్మిలాకు రాజకీయాలు కొత్తేమీ కాదు. తెలంగాణలో షర్మిలా కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు వచ్చినప్పుడు చాలామంది తెలంగాణ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే తాను తెలంగాణ కోడలినంటూ తానెందుకు పార్టీ పెట్టకూడదని ప్రశ్నించారు. అంతేకాదు తెలంగాణ పట్ల తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే పట్టుదల తనలో ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే షర్మిలా కూడా ఇప్పుడు తన ఆహార్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
పోచంపల్లి చీరలో వైయస్ షర్మిలా
తెలంగాణలో మరో కొత్త రాజకీయా పార్టీ అవతరించబోతోంది. వైయస్ షర్మిలా నేతృత్వంలో ఈ పార్టీ ఊపిరిపోసుకోనుంది. అయితే గతంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో వైయస్ షర్మిలా తన తండ్రి వైయస్సార్ ఆహార్యంతో చాలా మంది ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక తెలంగాణలో ఆమె పార్టీ పెట్టనుండటంతో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పచుకున్నారు. ముందుగా ఆమె గెటప్ను చాలా సింపుల్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణలో గుర్తింపు ఉండేలా షర్మిలా పోచంపల్లి చీరను ధరించారు. లోటస్ పాండ్ నుంచి ఖమ్మంకు బయలుదేరే ముందు షర్మిలా నిమ్మపండు రంగులో ఉండి నీలం రంగు అంచు ఉన్న పోచంపల్లి చీరను ధరించారు. చాలా సింపుల్గా కనిపించారు. చీరలో చాలా అరుదుగా కనిపించే షర్మిలా... పార్టీ పెట్టాలన్న ఆలోచనతో వచ్చినప్పటి నుంచి...నిర్వహించిన సమావేశాలకు చీరకట్టులోనే కనిపించారు.
పంచెకట్టులో ప్రజలకు కనెక్ట్ అయిన వైయస్
ఇక షర్మిలా ధరించిన చీర పోచంపల్లిలో నేసింది కావడంతో పోచంపల్లి బ్రాండ్కు మరింత ప్రాధాన్యత దక్కిందనే చెప్పుకోవాలి. సాధారణంగా రాజకీయనాయకులు తాము ధరించే బట్టల ద్వారా స్పెషల్ అట్రాక్షన్ పొందుతారు. ఉదాహరణకు షర్మిలా తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పంచెకట్టు ధరించి కనిపిస్తారు. అలా పంచెకట్టులో కనిపించినప్పుడు వైయస్సార్ తమ ఇంట్లో సభ్యుడిగా ప్రజలకు కనెక్ట్ అయ్యారు. పంచెకట్టులో ఆయన నడిచివస్తుంటే రాజసం ఉట్టిపడేది. రాజశేఖర్ రెడ్డి అంటే అందరి మనసుల్లో మెదిలేది ఆయన పంచెకట్టే.
పసుపు చొక్కాతో చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆయన ఎప్పుడూ లేత పసుపురంగు చొక్కా, ప్యాంటు ధరిస్తారు. టీడీపీ రంగు పసుపు కాబట్టి సింబాలిక్గా చెప్పేందుకే ఈ దుస్తులు ధరిస్తారు చంద్రబాబు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ కొన్ని వేలమంది కార్యకర్తలు అభిమానులు గుమికూడుతారు. అంతమందిలో కూడా ఈ మాజీ ముఖ్యమంత్రిని చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నామంటే అందుకు కారణం ఆయన ధరించే పసుపు రంగు చొక్కానే. ఇలా ఆయన ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక సామాన్యుడిలానే కనిపిస్తారు. ఢిల్లీ గల్లీల్లో తిరిగే సామాన్యుడిలా తలకు మఫ్లర్ చుటుకుని కనిపించేవారు.తన పార్టీ పేరు ఆమ్ ఆద్మీకి తగ్గట్టుగానే అతని డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇదే ఆయన్ను ప్రజలకు చేరువయ్యేలా చేసింది.
ఆకుపచ్చ చీరలో అమ్మ-తెలుపు చీరలో దీదీ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఎక్కువ సార్లు ఆకుపచ్చ రంగు చీర ధరించే కనిపించేవారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులు. అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాబట్టి తాను ధరించిన చీర కూడా ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకునేవారు జయలలిత. ఎప్పుడు ప్రజల్లో కనిపించినా ఆ ఆకుపచ్చ చీరతోనే కనిపించేవారు అమ్మ. ఇక బెంగాల్ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సాధారణ మహిళ మమతా బెనర్జీ. దీదీ ఆహార్యం కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ నీలం అంచు కలిగి ఉన్న తెల్ల చీరలోనే కనిపిస్తారు. ఆమె సాదాసీదా తనమే బెంగాల్ ప్రజలకు మరింత చేరువ చేసిందని చెబుతారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఇలా చెప్పుకుంటూ పోతే యూపీ మాజీ సీఎం బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఎప్పుడూ పసుపు రంగు పంజాబీ డ్రెస్లో కనిపిస్తారు. ఇలా ఎవరికి తగ్గట్టుగా వారు తమ గెటప్స్లో వైవిధ్యాన్ని జోడిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
మొత్తానికి కొత్త పార్టీ పెట్టనున్న షర్మిలా కూడా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా చాలా సింపుల్గా ఉండే చీరలను ధరించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిలా అభిమానులు,వైయస్సార్ అభిమానులు కూడా తెలంగాణ బతుకమ్మ అంటూ అభివర్ణిస్తున్నారు.
Recommended Video