ఐపీఎస్ ప్రవీణ్కు షర్మిల పార్టీ మద్దతు... దాడులకు ప్రతిదాడులు ఉంటాయని ఏపూరి సోమన్న హెచ్చరిక...
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై జరిగే దాడులకు ప్రతిదాడులు చేస్తామని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న హెచ్చరించారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందిస్తున్న అధికారిపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. ఒక అధికారిపై కులం, మతం పేరుతో జరిగే దాడిని షర్మిల పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సోమవారం(మార్చి 22) హైదరాబాద్లోని లోటస్పాండ్లో నిర్వహించిన సమావేశంలో సోమన్న మాట్లాడారు.
దొరల పాలన వద్దు.. రాజన్న పాలన ముద్దు: షర్మిల
ఏప్రిల్ 9న ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభకు కళాకారులను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్... తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇద్దరూ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని... దొరల చేతిలో రాష్ట్రం బందీ అయిందని విమర్శించారు. దొరల తెలంగాణ పోయి బడుగు బలహీన వర్గాల తెలంగాణ రావాలని... అది జరగాలంటే రాజన్న బిడ్డ షర్మిలను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోటస్పాండ్లో జరిగిన సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ముస్లింలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల్లో 57వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు అమలుచేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సమస్యలపై పోరాటం చేస్తానని.... వారికి అండగా నిలబడుతానని తెలిపారు.
ఐపీఎస్ ప్రవీణ్ vs బీజేపీ.. బండి సంజయ్ను చంపే కుట్ర అని ఆరోపణలు... కొట్టిపారేసిన పోలీసులు..
తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో ఆమె ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సామాజిక,రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఖమ్మంలో భారీ సభ నిర్వహించబోతున్నారు. పార్టీ ఎజెండాను ఈ సభలో ప్రకటించనున్నారు. సభకు భారీగా జనసమీకరణ చేసేలా ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.