YS Sharmila: బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కాంగ్రెస్ పై ఐటీ దాడులు-షర్మిల ఫైర్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేంద్రంతో కుమ్మక్కై కేసీఆర్ ఈ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని షర్మిల వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన షర్మిల.. ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడన్నారు.ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు మోదీ సాయం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.

గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయని షర్మిల హెచ్చరించారు.సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, మద్దతుదారులను మీరు ఇబ్బందులపాలు చేయడమే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తూబీజేపీ, బీఆర్ఎస్ లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని షర్మిల విమర్శించారు. కాలేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ పై ఎలాంటి విచారణ ఉండదని, లిక్కర్ స్కాంలో వేలకోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరని షర్మిల ఆరోపించారు.
భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు జరగవని, కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుందని షర్మిల ప్రశ్నించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదన్నారు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవని బీఆర్ఎస్, బీజేపీలకు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications