వైఎస్ షర్మిల మహా పాదయాత్రకు బ్రేక్: ఆ దీక్ష పునరుద్ధరణ
హైదరాబాద్: తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడంపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన పాదయాత్ర..మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంది.

గ్రామస్థాయి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా..
చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో సాగుతోంది. చేవెళ్ల టౌన్లో బహిరంగ సభను నిర్వహించిన అనంతరం ఆమె పాదయాత్ర మొదలైంది. చేవెళ్ల, శంషాబాద్ తరువాత మహేశ్వరంలో బహిరంగ సభను నిర్వహించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పిస్తున్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం దృఫ్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నారు. తన పాదయాత్ర సందర్భంగా ఎదురైన అంశాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను ఆమ అదే రోజు రాత్రి విడుదల చేస్తోన్నారు.

ఏడో రోజు బ్రేక్..
వైఎస్ షర్మిల పాదయాత్రకు ఏడో రోజు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనికి కారణం- నిరుద్యోగ నిరాహార దీక్ష. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో నెలకొన్న లక్షా 91 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఒకరోజు నిరాహార దీక్షకు కూర్చుంటున్న విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం ఈ ఆందోళనను కొనసాగిస్తూ వచ్చారు.

గత మంగళవారం రద్దు..
కిందటి వారం ఈ దీక్షను చేపట్టలేదు వైఎస్ షర్మిల. మరుసటి రోజు నుంచే చేవెళ్ల నుంచి మహా పాదయాత్రను ప్రారంభించాల్సి ఉన్నందున ఆమె గత మంగళవారం ఏపీలోని సొంత జిల్లా కడపలో పర్యటించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులను తీసుకోవడానికి ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్సార్ ఘాటకు వెళ్లాల్సి ఉన్నందున గత మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష ఆందోళనను ఆ ఒక్క వారానికి మాత్రమే రద్దు చేసుకున్నారు.

మళ్లీ పునరుద్ధరణ..
ఈ వారం మళ్లీ నిరుద్యోగ నిరాహార దీక్షను పునఃప్రారంభించనున్నారు. తన పాదయాత్రలో భాగంగానే ఆమె ఈ దీక్షకు కూర్చుంటారు. ప్రస్తుతం ఆమె పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూర్ మండలం అగర్మియాగూడకు చేరుకుంది. రాత్రి అక్కడే బస చేశారు. ఈ ఉదయం 9:30 గంటలకు తన క్యాంప్ నుంచి బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు తిమ్మాపూర్కు చేరుకుంటారు. తిమ్మాపూర్లో నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చుంటారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అనంతరం- దీక్షా శిబిరం నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Recommended Video

తిమ్మాపూర్లో క్యాంప్..
ఈ రాత్రికి తిమ్మాపూర్లోనే బస చేస్తారు. బుధవారం యధాతథంగా ఆమె పాదయాత్ర మొదలవుతుంది. బుధవారం నాటితో మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా- తన వైఎస్ షర్మిల.. తన పాదయాత్ర సందర్భంగా జనంతో మమేకం అవుతున్నారు. సోమవారం సాయంత్రం షర్మిలక్కతో మాటా-ముచ్చట విజయవంతమైందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు తమ అధినాయకురాలిని సొంత ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తున్నారని స్పష్టం చేస్తోన్నారు. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించే సమయానికి ఎలాంటి ప్రజాదరణ ఉందో.. ఇప్పుడు దానికి రెట్టింపు అయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications