Video: తిరుపతిలో ఘోరం: కొడుకు మృతదేహాన్ని 90 కి.మీ బైక్పై తరలించిన తండ్రి: నారా లోకేష్ ఫైర్
తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని ఓ తండ్రి 90 కిలోమీటర్లకు పైగా బైక్పై ప్రయాణం చేశాడు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకోలేక- కుమారుడి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమ బంధువులు అంబులెన్స్ను ఏర్పాటు చేసినప్పటికీ.. దాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తిరుపతి రూయాలో
అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జెసవా అనే బాలుడు కిడ్నీల వైఫల్యంతో బాధపడుతు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర రామ్నారాయణ్ రూయా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో మరణించాడు. మృతదేహాన్ని స్వస్థలం చిట్వేలుకు తరలించడానికి అంబులెన్స్ కోసం తండ్రి ప్రయత్నించగా.. సాధ్యపడలేదు. అంబులెన్స్ను ఏర్పాటు చేయడానికి రూయా ఆసుపత్రి సిబ్బంది లంచం అడిగారు. తాము అడిగినంత డబ్బులు ఇస్తే గానీ అంబులెన్స్ను ఏర్పాటు చేయబోమని తేల్చి చెప్పారు.
బైక్పై చిట్వేలుకు..
బాలుడి తండ్రి వేడుకున్నప్పటికీ అంబులెన్స్ డ్రైవర్లు స్పందించలేదు. దీనితో తన సమీప బంధువుకు చెందిన బైక్పై రూయా ఆసుపత్రి నుంచి చిట్వెలుకి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతిష్ఠాత్మక రూయా ఆసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల నిర్వాకాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ దారుణ ఘటన పట్ల పలువురు నెటిజన్లు స్పందించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
నారా లోకేష్ ఫైర్..
తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్.. ఈ ఘటనపై స్పందించారు. చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటనను ప్రస్తావించారు. మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుందని, ఇప్పుడు తాజాగా ప్రైవేట్ అంబులెన్స్ ధందా సాగుతోందని మండిపడ్డారు. దీన్ని అమానవీయ ఘటనగా అభివర్ణించారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు.
మహా ప్రస్థానం వాహనాలు ఏమయ్యాయ్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలకుడని ధ్వజమెత్తారు. చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ. బైక్పై తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. బాలుడి జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా సిబ్బంది కనికరం చూపలేదని, దీనికి కారణం జగన్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మృతదేహాలను ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
నిద్రలేవండి..
వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చేసిందని నారా లోకేష్ ఆరోపించారు. ఆ కారణం వల్లే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగిందని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ నిద్రలేవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మామూళ్లు, ధందాలు పెరిగిపోయాయని విమర్శించారు.