తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్లో ఘటన -షాకింగ్ కారణం
ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకపర్వానికి సంబంధించిన మరో ఘటన సంచలనం రేపుతున్నది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు పోలీసులు అత్యాచారా ఆరోపణలు ఎదుర్కొంటుండటం, తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దళిత యువకుడికి శిరోముండనం చేయించడం, ఆ మధ్య కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులే నిందితులుగా ఉండటం తదితర ఘటనల తర్వాత తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు, బాధితురాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
హంగ్: జీహెచ్ఎంసీకి మళ్లీ ఎన్నికలు -2నెలల్లో కేసీఆర్ సర్కారు ఖతం -విజయశాంతి సంచలనం
ఆమె ఆదర్శ ఆటో డ్రైవర్
తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. పురుషులే ఆధిపత్యం చెలాయించే రవాణా రంగంలో మహిళా సాధికారతకు గుర్తుగా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారామె. తన ఇంటి ఆవరణలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు శనివారం రాత్రి ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమెకు దారుణమైన అనుభవం ఎదురైంది. స్టేషన్ లోపలే ఎస్సై ప్రకాశ్ కుమార్ ఆమెపై ప్రతాపం చూపించాడు. పోలీస్ బెల్టుతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. రాత్రి వేళ ఆమె స్టేషన్ కు ఎందుకు వెళ్లిందంటే..
అసలేం జరిగిందంటే..
ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తోన్న వనితా వాణి స్థానిక ఉప్పరపల్లిలో నివసిస్తున్నారు. శనివారం ఆమె ఇంటి ఆవరణలోకి కొన్ని గేదెలు దూసుకొచ్చి గార్డెన్ ను ధ్వంసం చేశాయి. దీంతో గెదెలు బయటకు వెళ్లకుండా ఆమె గేటు వేశారు. ఈ విషయం తెలుసుకున్న పశువుల యజమానులు.. వనిత ఇంటికి చేరుకుని ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో గొడవ కొట్లాటకు దారి తీస్తుందనగా, ఆమె 100కు డయల్ చేశారు. కాసేపటికే అక్కడికి పోలీసులు రావడంతో పశువుల యజమానులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకుగానూ బాధితురాలు ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో..
తడి గచ్చుపై లోనికి వచ్చిందని..
బాధితురాలు వనితా రాణి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్న సమయానికి.. పూజలు చేసేందుకు స్టేషన్ గదులు, ఆవరణను శుభ్రం చేసి ఉంచారు. ఆ విషయాన్ని గమనించకుండా ఆమె.. తడి గచ్చుపైనే నడుచుకుంటూ లోపలికి వెళ్లింది. పూజకోసం సిద్ధమైన ఎస్సై ప్రకాశ్ కుమార్.. ఆమె అలా లోనికి రావడాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలాడాడు. ఎందుకలా తిడుతున్నారని బాధితురాలు ప్రశ్నించడంతో ఆ ఎస్సై మరింతగా రెచ్చిపోయాడు. విచక్షణ కోల్పోయి బెల్టుతో ఆమెను చితకబాదాడు. ఆ తర్వాత..
Recommended Video
స్టేషన్ ముందు ధర్నా.. సీఐ హామీ
ఎస్ఐ ప్రకాశ్ కుమార్ చర్యతో షాక కు గురైన బాధితురాలు వనిత.. తనపై దాడి ఘటనను ఫిర్యాదు చేసేందుకు దిశ పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అయితే ఎస్పీ ఊళ్లో లేరని తెలియడంతో మళ్లీ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆవరణలో ధర్నాకు దిగింది. రాత్రి వేళ స్టేషన్ ముందు మహిళ ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ సురేంద్రనాథ్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకోగా.. ఎస్సై ప్రకాశ్ కుమార్ బెల్టుతో దాడిచేసిన తీరు, ధర్నా చేస్తున్న సమయంలో తన పట్ల మహిళా పోలీసు దురుసుగా వ్యవహరించిన అంశాలను బాధిత మహిళ సీఐకి వివరించింది. దీంతో..
అరిచినందుకే కొట్టానన్న ఎస్సై ప్రకాశ్..
మహిళపై ఎస్సై దాడి చేశారన్న ఆరోపణలపై సీఐ సురేంద్రనాథ్రెడ్డి వేగంగా స్పందించారు. బాధితురాలు వనీతా రాణిని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి, ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. గేదెల యజమానులపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై బెల్టుతో దాడిచేసిన ఎస్సై ప్రకాశ్ కుమార్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. ఈ లోపే అక్కడికి చేరుకున్న మీడియా.. ఎస్సై ప్రకాశ్ ను వివరణ కోరగా.. ఎంతసేపూ మాట వినకుండా అరుస్తుండటంతో మహిళ పట్ల అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సైతం వివరణ కోరినట్లు తెలుస్తోంది.