తిరుమలకు వైఎస్ జగన్: ఏర్పాట్లు పూర్తి చేస్తోన్న టీటీడీ
తిరుపతి: ఈ సంవత్సరం అధికమాసం కారణంగా తిరుమలలో వెలిసిన శ్రీవేంకటేశ్వర స్వామివారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శతకోటి భక్తులకు కన్నులపండువగా ఈ జంట బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు మొదలు పెట్టింది. లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టింది.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ జంట బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టీటీడీ. సెప్టెంబర్ 18 నుంచి 26 తేదీల మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనావేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి. అదే రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తిరుమలను సందర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తన పర్యటన సందర్భంగా తిరుపతిలో శ్రీనివాస సేతు వంతెననూ ఆయన ప్రారంభిస్తారు.
22వ తేదీన గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథోత్సవం, 25వ తేదీన రథోత్సవం ఉంటుంది. 26వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల్లో కనీసం 10 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది టీటీడీ. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
అదే విధంగా- అక్టోబర్ 15వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతాయి. 19వ తేదీన గరుడ వాహనం, 20వ తేదీన పుష్పక విమానం, 22వ తేదీన స్వర్ణరథం, 23వ తేదీన చక్రస్నానం ఉంటుంది. చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దేవీ శరన్నవరాత్రులతో కూడిన బ్రహ్మోత్సవం కావడం వల్ల మరోసారి లక్షల్లో భక్తులు తిరుమలకు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications