వాతావరణ మార్పులను పసిగట్టేలా
ISRO: భారత అంతరిక్ష పరిశోన సంస్థ.. ఇస్రో మరో కీలక ప్రాజెక్ట్ను చేపట్టింది. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి ఉద్దేశించిన ఇన్సాట్-3డీఎస్ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ సాయంత్రం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లబోతోంది. ఈ సాయంత్రం సరిగ్గా 5:35 నిమిషాలకు రాకెట్ ప్రయోగించనుంది ఇస్రో. దీనికి అవసరమైన కౌంట్డౌన్ను ఇదివరకే చేపట్టింది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులపై ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఇన్సాట్- 3డీఎస్ ఉపగ్రహం బరువు 2,274 కేజీలు. 10 సంవత్సరాల పాటు ఇది అంతరిక్షం నుంచి సేవలను అందిస్తుంది. ఇదివరకు 2013లో ప్రయోగించిన ఇన్సాట్-3డీ, 2016లో పంపించిన ఇన్సాట్-3డీఆర్ కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పుడీ 3డీఎస్ సేవలు అవసరం అయ్యాయి.
ఈ ఉపగ్రహానికి నాటీ బాయ్ అని పేరు పెట్టింది ఇస్రో. ప్రయోగించిన 18 నిమిషాల వ్యవధిలో ఈ రాకెట్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో చరిత్రలో ఇది 16వ ప్రయోగం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్తో ఈ రాకెట్ను రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు.
భూ, సముద్ర ఉపరితలాలపై ఏర్పడే వాతావరణ పరిస్థితులపై అధునాతన పద్ధతుల్లో అధ్యయనం చేస్తుంది ఈ శాటిలైట్. వాటి డేటాను గ్రౌండ్ స్టేషన్కు చేరవేస్తుంది. దీన్ని విశ్లేషించడం వల్ల ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications