నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తిరుపతి: ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన శబరిమల అంశంపై స్పందించారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు వెల్లకూడదనే విషయంపై కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు.
వారిని తోలు ఊడేలా కొట్టాలి: నాకు ఇద్దరు ఆడబిడ్డలంటూ దిశ, సుగాలి ఘటనలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
గతంలోనే కేరళ కోర్టు..
గతంలో కేరళ కోర్టు దీనిపై స్పందిస్తూ.. ఇది వారి ధర్మానికి సంబంధించిన విషయమని, తమకు సంబంధం లేదని చెప్పిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు కొందరు వెళ్లారని అన్నారు. ఈ క్రమంలో తన భార్య శబరిమల ఇష్యూపై అడిగిందని పవన్ చెప్పారు.
అదే నా భార్యకు చెప్పా..
సికింద్రాబాద్లో ఒక చర్చికి తీసుకెళ్లినప్పుడు.. ‘నువ్వు నీ తల మీద ముసుగు వేసుకున్నావు కదా ఎందుకు అని అడిగా..' అది తమ ఆచారమని తన భార్య చెప్పిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే ఒక్కో ధర్మానికి ఒక ఆచారం ఉంటుందని.. అయ్యప్పస్వామి బ్రహ్మచారి.. తపస్సులో ఉంటారు కాబట్టి మహిళలు ఎవ్వరినీ చూడరని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని తన భార్యకు చెప్పానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రెచ్చగొట్టేవారిపనే.. మా తల్లి బాధపడింది..
కొందరు రెచ్చగొట్టే పనులు చేసేవారే శబరిమల విషయంలో కోర్టును ఆశ్రయించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి విషయాలు వదిలేయండి.. ఎందుకు? అని అన్నారు. శబరిమలకు తమకూ రావాలనే ఉంది కానీ.. అక్కడి ఆచారాన్ని గౌరవిస్తూ అక్కడికి రామని చాలా మంది అంటున్నారని చెప్పారు. శబరిమల ఆలయప్రవేశంపై జరిగిన వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎక్కడికెళ్లినా అక్కడి సాంప్రదాయమే.. వాటికిన్ సిటీకి వెళ్లి భజన చేస్తామా?
మనం మక్కా వెళ్లినా.. కడప దర్గాకు వెళ్లినా అక్కడి సాంప్రదాలను గౌరవిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. శబరిమల ఆలయం సంప్రదాయాలను కూడా మనం గౌరవించాలని అన్నారు. వాటికన్ సిటీకి వెళ్లి మనం హరే రామ భజన చేయం కదా? అని ప్రశ్నించారు. అలాగే తిరుమల సంప్రదాయాలను కూడా గౌరవించాలని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఎలా పడితే అలా వాడకూడదని హితవు పలికారు. తాను ఓట్ల కోసం మాట్లాడనని అన్నారు.
కడప దర్గా.. చర్చిలో అలా అంటే కుదరదని..
తిరుపతి ఆలయంలో ప్రవేశించాలంటే అక్కడి నిబంధనలను పాటించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ ఇతర మతాల ప్రచారం జరగకూడదని అన్నారు. కడప దర్గాకు వెళ్లి జై భవానీ.. ఏడుకొండలవాడన్నా తాను ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ చెప్పారు.చర్చికి వెళ్లి హరే రామ అన్నా ఒప్పుకోనని అన్నారు. దీనిని ఎవరైనా గౌరవించాలని అన్నారు.