టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు... పట్టు వదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు...
టీడీపీ ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న రమణ దీక్షితులు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా కోసం రమణ దీక్షితులు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇందుకోసం తరచూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎట్టకేలకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించడంతో టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఆయన రీఎంట్రీ ఇస్తున్నారు. వయోపరిమితి కారణంగా గతంలో రిటైర్డ్ అయిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు శనివారం(ఏప్రిల్ 2) టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అధికార బదలాయింపు సంగతేంటి?
గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టడంతో... ఇప్పుడున్న ప్రధాన అర్చకుల పరిస్థితేంటన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకుడిగా గొల్లపల్లి వంశానికే చెందిన వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. వేణుగోపాల్ దీక్షితులు పర్మినెంట్ ఉద్యోగి కావడంతో... అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోవని ఆలయ అధికారులు తెలిపారు. ఒకవేళ అధికార బదలాయింపు చేపట్టే పక్షంలో వేణుగోపాల్ దీక్షితులు కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.

అప్పటి పాలకమండలి నిర్ణయంతో...
సాధారణంగా శ్రీవారి ఆలయంలో తిరుపతమ్మ,గొల్లపల్లి,పెద్దింటి,పైడిపల్లి వంశాలకు చెందిన నలుగురు ప్రధాన అర్చకులుగా ఉంటారు. వీరినే మిరాశీ వంశస్తులు అంటారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి వయోపరిమితి నిబంధనలు తీసుకొచ్చింది. 65 ఏళ్లు పైబడిన వారిని విధుల్లో నుంచి తొలగించింది. దీంతో అప్పటి టీటీడీ ప్రధాన అర్చకులైన గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులు,తిరుపతమ్మ వంశం నుంచి నరసింహ దీక్షితులు,పైడిపల్లి వంశం నుంచి శ్రీనివాసమూర్తి దీక్షితులు,పెద్దింటి వంశం నుంచి నారాయణమూర్తి దీక్షితులు, శ్రీవారి ఆలయంలోని మరో ఐదుగురు అర్చకులు విధుల్లో నుంచి తొలగించబడ్డారు.అలాగే తిరుచానూరు ఆలయంలోని పలువురు అర్చకులు కూడా విధుల్లో నుంచి తొలగించబడ్డారు.

పట్టు వదలని దీక్షితులు...
టీటీడీ పాలకమండలి తీసుకున్న వయోపరిమితి నిర్ణయాన్ని అప్పట్లో తిరుచానూరు అర్చకులు హైకోర్టులో సమావాల్ చేశారు. దీంతో కోర్టులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిట్గా ఉన్న అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ టీటీడీ ఆ ఆదేశాలను అమలుచేయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి హైకోర్టు తీర్పు ఆధారంగా తిరిగి తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరారు.
దీంతో 2019,నవంబర్లో ఆయన్ను టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుడిగా నియమించారు. అయితే ఆ పదవిని చేపట్టేందుకు రమణ దీక్షితులు విముఖత చూపించారు. 2019,డిసెంబర్ 28న ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించినా.. దానిపై కూడా విముఖత వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమిస్తామన్న హామీ మేరకు గౌరవ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ హోదాలో కొనసాగుతూనే... పట్టు వదలకుండా జగన్పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు మళ్లీ ప్రధాన అర్చకుడి హోదాను దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications