నవంబరు 27న ఆన్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కోరుతోంది.

శ్రీ వరాహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో నవంబరు 25 నుంచి 29వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ నేపథ్యంలో బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఇందులో భాగంగా రాత్రి శ్రీ విష్వక్సేనుల వారిని శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం నిర్వహించారు. అనంతరం శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.
శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2020, డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
సొంత ఛానల్, రేడియో ఉన్నందువల్లే ఆకాశవాణిలో ప్రసారాలు ఆపివేశాం: టీటీడీ
Recommended Video
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, ఇతర సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, ఎస్వీబీసీ రేడియో, ఎస్వీ ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రసారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆకాశవాణి ద్వారా ఈ ప్రసారాలను నిలుపుదల చేయించినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో టిటిడి ఆకాశవాణితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవారి ఆలయంలో జరిగే సేవలను ప్రసారం చేసేందుకు గాను ఆకాశవాణికి ఏడాదికి రూ.35 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. టిటిడికి సొంత ఛానల్, ఎఫ్ఎం రేడియో ఉన్నందువల్ల ఆకాశవాణిలో ఈ ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిటిడి ఎఫ్ఎం రేడియో, ఎస్వీబీసీ రేడియోలో శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన ఇతర సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతోంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినాలని కోరింది టీటీడీ.












Click it and Unblock the Notifications