తిరుమలలో కీలక ఘట్టం: నెల రోజులు మూసివేత
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 79,327 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,894 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉండనక్కర్లేదు. క్యూ లైన్ల గుండా నేరుగా దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తిరుమలలో కీలక ఘట్టానికి తెర లేవనుంది.

నెల రోజుల పాటు శ్రీవారి ఆలయ పుష్కరిణిని మూసివేయనున్నారు టీటీడీ అధికారులు. ఇంకో రెండు నెలల్లో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరిణి వార్షిక నిర్వహణా పనులను చేపట్టడానికి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించారు.
ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణి మూత పడనుంది. దీనితో పాటు నెల రోజుల పాటు పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని రద్దు చేశారు. నిర్వహణ పనుల్లో భాగంగా పుష్కరిణి జలాలను తోడివేస్తారు. పైపు లైన్లకు మరమ్మతులను చేపడతారు. సివిల్ పనులను పూర్తి చేస్తారు.
మొదట పది రోజుల పాటు నీటిని తోడి వేస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ విలువ 7 ఉండేలా చూస్తారు. పీహెచ్ 7 అనేది నీరు ఎంత శుద్ధంగా ఉంటుందనేది తెలియజేస్తుంది. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications