కొత్త ఏడాది- జనవరి 2024లో శ్రీవారి దర్శనం టికెట్ల విడుదల తేదీలు ఇవే..!!
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు.
మంగళవారం 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,579 మంది తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించారు. ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. హుండీ ద్వారా టీటీడీకి 3.69 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

ఇక ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. రోజూ లక్షమంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తోన్నారు.
కొత్త సంవత్సరం జనవరిలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించాలనుకునే భక్తులకు ఉద్దేశించిన 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆర్జిత సేవ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్, ఎర్న్డ్ సర్వీస్, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణం టికెట్ల కోటా టికెట్లను ఏ రోజున విడుదల చేస్తారనే షెడ్యూల్ను విడుదల చేశారు.
ఆర్జిత సేవ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయి. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఆర్జిత సేవా టికెట్లు అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయి. 500 రూపాయలు, 1000 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
అంగప్రదక్షణం టికెట్లను అక్టోబర్ 23వ తేదీన ఉదయం 10:00 గంటలకు విడుదల అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ (బ్రేక్ దర్శనం) టికెట్లు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల అవుతాయి. అక్టోబర్ 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ టికెట్లు విడుదల చేస్తారు.
అక్టోబర్ 24వ తేదీన ఉదయం 11:00 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేస్తారు. అక్టోబర్ 25వ తేదీన ఉదయం 10:00 గంటలకు తిరుపతి, తిరుమలల్లో వసతి గదుల బుకింగ్ ఆరంభమౌతుంది. ఆయా టికెట్లన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications