భగవద్గీత వర్సెస్ బైబిల్..రెండు కొండలు వర్సెస్ ఏడు కొండలు: బీజేపీ నినాదాలివే: మరో దారి లేనట్టే
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మతాన్నే నమ్ముకుంది. మతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఎన్నికల ప్రచార బరిలో దిగింది. దాన్నే ఎన్నికల ప్రధానాస్త్రంగా మలచుకుంది. రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న విగ్రహాల విధ్వంసం, దేవాలయాలపై దాడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నాలను ప్రారంభించింది. మొన్నటికి మొన్న శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఓబీసీ ప్రతినిధుల సభలో పాల్గొన్న నేతలు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు కూడా.
Recommended Video
భగవద్గీత వర్సెస్ బైబిల్
ఈ 18 నెలల కాలంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్రంలో పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకపోవడం వల్ల తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రత్యామ్నాయంగా మతాన్ని తెర మీదికి తీసుకుని వచ్చిందని అంటున్నారు. అందుకే- ఇక నేరుగా తిరుపతి ఉప ఎన్నిక భగవద్గీత వర్సెస్ బైబిల్ మధ్య జరుగనున్న పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు రాజకీయంగా దుమారాన్ని రేపిన.. తిరుపతి రెండు కొండలు అనే నినాదాన్ని కూడా బీజేపీ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్గా
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ను దింపింది పార్టీ అధిష్ఠానం. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన ఆయన.. తన దైన శైలిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు కూడా. తిరుపతి ప్రజలందరూ హిందూ ఓటుబ్యాంకుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక పోరాటం.. వైసీపీ-బీజేపీ మధ్య కాదని, బైబిల్-భగవద్గీత, రెండు కొండలు-ఏడుకొండల మధ్య కొనసాగుతోన్న పోరుగా అభివర్ణించడం.. ప్రచార తీవ్రతను చాటుతోంది.
హిందువులు పిరికివాళ్లు కాదంటూ..
తిరుపతిలో నివసిస్తున్న హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ సమయం సమీపించిందని బండి సంజయ్ చెబుతున్నారు. విగ్రహాల విధ్వంసకులకు తిరుపతి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. రామతీర్థంలో శ్రీరామచంద్రులవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి, అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టించిన వారిని క్షమించకూడదని విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే వరుస ట్వీట్లను సంధించారు.
ఓపికను పరీక్షించొద్దు..
ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులనే తిరుపతి ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. హిందువులకు అతిపెద్ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బిజెపిని గెలిపించి ధర్మ రక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల సహనాన్ని జగన్ సర్కార్ పరీక్షిస్తోందని, తమ ఓపికను పిరికితనంగా భావిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. హిందువుల సత్తా ఏమిటో తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ సర్కార్కు తెలిసేలా చేయాలని సూచించారు. తెలంగాణ సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నిక తరహా ఫలితం తిరుపతిలో వెలువడుతుందని జోస్యం చెప్పారు.