తిరుమల ఇప్పుడే రావొద్దు: ధ్వంసమైన ఘాట్ రోడ్డును పరిశీలించిన టీటీడీ ఛైర్మన్
తిరుపతి: కొద్దిరోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఏపీలోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అతి భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను ముంచెత్తాయి. ఈ నాలుగు జిల్లాలతో పాటు కర్నూలు, ప్రకాశం, గుంటూరుల్లోనూ అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాల్లో పెను వరదలకు కారణం అయ్యాయి.
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు: కుంగిన రోడ్డు: మూడు చోట్ల ధ్వంసం
బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుఫాన్గా మారుతుందని, దీని ప్రభావంతో ఈ దఫా ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు పడతాయని తేల్చి చెప్పారు. ఇప్పటిదాకా తిరుమల-తిరుపతిలో మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనంత భారీ వర్షం కురిసింది. ఇంకా భారీ వర్షాల తీవ్రత కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తోన్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని స్పష్టం చేస్తోన్నారు.
ఈ భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ తెల్లవారు జామున ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగి పడటం వల్ల రోడ్డు సైతం కుంగిపోయింది. పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడ్డాయి. నాలుగైదు చోట్ల ఘాట్ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కుంగిపోయింది. ప్రయాణం సాగించడానికి ఏ మాత్రం వీలు లేని పరిస్థితులు ఘాట్ రోడ్డు మీద నెలకొన్నాయి. దీనితో అధికారులు ఒకే మార్గంలో తిరుమలకు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీరింగ్, అటవీ, విజిలెన్స్ విభాగాలకు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. తక్షణ చర్యలను చేపట్టారు. కొండచరియలు విరిగి పడిన ఘాట్ రోడ్డును టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైందని చెప్పారు. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విపరీతంగా విరిగిపడుతున్నాయని అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన ధ్వంసమైన రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నామని వివరించారు. రోడ్లను మరమ్మతు చేయడానికి ఐఐటీ నిపుణులను రప్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరమ్మతు పనుల కారణంగా ఒకే ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు బుక్ చేసుకున్న టికెట్ల మీద ఆరునెలల్లో ఎప్పుడైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని చెప్పారు.