దర్శనాలు - సేవల పై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన..!!
తిరుమలలో రధసప్తమికి ప్రత్యేక ఏర్పాట్లు. బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటన.
తిరుమలలో ఈ నెల 28న రధ సప్తమి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సూర్యజయంతి అయిన రధ సప్తమిని తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా భావిస్తారు. ఆ తరహాలో వేడుకలను నిర్వహిస్తారు. రధ సప్తమి నాడు ఏడు వాహనాల్లో మాడ వీధుల్లో శ్రీవారు విహరిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా ఏడు వాహనాల ఊరేగింపు ఉంటుంది. రధసప్తమి నాడు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. ఏర్పాట్లు..దర్శనాలు..వసతికి సంబంధించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక అంశాలను వెల్లడించారు.
రధసప్తమి వేడుకల నిర్వహణ పైన టీటీడీలోని పలు విభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్షించారు. మినీ బ్రహ్మోత్సవంగా భావించే రధ సప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదేశించారు. తిరుమల మాడ వీధుల్లో ఏడు వాహనాల పైన శ్రీవారి ఊరేగింపు నిర్వహణ పైన పలు సూచనలు చేసారు.

సప్త వాహనాల పైన స్వామి ఊరేగింపు వేళ..భక్తులు సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించారు. అదే సమయంలో 28న తిరుపతిలో కౌంటర్లలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను రద్దు చేశామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆరోజున భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకోవాలని సూచించారు.
రధ సప్తమి వేడుకల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. ఆర్జిత సేవలతో పాటుగా సినీయర్ సిటిజెన్స్.. దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక..శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్లను రేపు (శుక్రవారం) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ప్రతీ రోజు వెయ్యి టికెట్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టికెట్ పొందిన వారికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తారు. శ్రీవాణి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం దేవాలయాల నిర్మాణానికి వినిగియోస్తున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇక.. రధసప్తమి నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications