TTD: ఆ వేళ అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, నిబంధనల సడలింపు - ఈవో ధర్మారెడ్డి..!!
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. ఈ సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల వేల అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో చెప్పుకొచ్చారు.
బ్రహ్మోత్సవాల వేళ కీలక నిర్ణయాలు: ఈనెల 18వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ వరకు జరిగే సాలగట్ల బ్రహ్మోత్సవాలు అదేవిధంగా అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం టిటిడి పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పెరటాసి మాసం కూడా వస్తున్నందు వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతిస్తామి ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేసారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత: సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్నదాన విభాగాన్ని ఆధునికరించినందుకు చర్యలు చేపట్టినట్లు ధర్మారెడ్డి తెలిపారు.
అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాద తయారీని మరింత పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. క్యాటరింగ్, పరిపాలన, అన్నప్రసాదాల తయారీ, పంపిణీ, పారిశుధ్య, స్టోర్స్ నిర్వహణ విభాగాలుగా విభజించి నిర్వహించనున్నట్లు తెలిపారు త్వరలోనే నూతన విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.

నిబంధనల సడలింపు దిశగా: నడక మార్గాల్లో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా అటవీ శాఖవారి సూచనల మేరకు రెండు నడక మార్గాలలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్ళలోపు పిల్లలను అనుమతిస్తున్నామన్నారు. పెద్దలను రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.
అయితే ద్విచక్ర వాహనాల రాకపోకలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పుకొచ్చారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అటవీ శాఖ అనుమతితో త్వరలో ఈ నిబంధనలు సడలిస్తామని ఈవో వెల్లడించారు. ఆగస్టు నెలలో 22.25 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోగా, హుండీ కానుకలు రూ.120.05 కోట్లు వచ్చినట్లు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications