Tirumala: సర్వదర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ కీలక నిర్ణయం..!!
తిరుమలలో వేసవి రద్దీ మొదలైంది. భక్తుల సంఖ్య పెరుగుతోంది. టీటీడీ రద్దీకి అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. శ్రీవాణి దర్శనంతో పాటుగా వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించింది. జూన్ 15 వరకు బ్రేక్ దర్శనం కోటా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాల్లోనూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

పెరుగుతున్న రద్దీ: తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం వరకు పడుతోందని చెబుతున్నారు. మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల నుంచి నాలుగు గంటల్లో దర్శనం అందుతోంది.
దివ్య దర్శనం టోకెన్లు జారీ: భక్తుల డిమాండ్ మేరకు కాలినడక వచ్చే భక్తుల కోసం తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందొచ్చు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించటం లేదు.
భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు: ఇక..కాగా వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు.
భక్తులు ఈ మార్పు గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఇదే సమయంలో పరీక్షలు ముగియటం..సెలవులు ప్రారంభం కావటంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలోనూ ఇదే అంశం పైన చర్చించారు. దర్శనం ..వసతి కల్పనలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications