తిరుమలలో వైకుంఠ ద్వారం తెరచుకునే సమయాన్ని ప్రకటించిన టీటీడీ
Tirumala: వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల ముస్తాబు అవుతోంది. లక్షలాది మంది భక్తులు తిరుమలను సందర్శంచనున్నారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఉత్తర ద్వారం గుండా భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ నెనల 23వ తేదీన తెల్లవారుజామున 1.45 నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు టీటీడీ అధికారులు ఉత్తర ద్వార దర్శనాలను నిలిపివేస్తారు. ఈ 10 రోజుల్లో కనీసం 10 నుంచి 12 లక్షలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారనే అంచనాలు ఉన్నాయి.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పలు ఆదేశాలను జారీ చేశారు. క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబరు 22 వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు.
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నెలకొల్పిన కౌంటర్ల ద్వారా ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు.
డిసెంబరు 22వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అధికారులు రద్దు చేశారు. దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయిస్తారు. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్నందున ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు తీసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజుల పాటు సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా స్వామివారిని దర్శించడానికి వచ్చే ప్రోటోకాల్ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పిస్తారు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుందని, వీఐపీలు, ఇతర భక్తులు ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు. వారికి శ్రీవారి దర్శనం ఉండదు. తలనీలాలు సమర్పించి, ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చు. దర్శన టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ, సమయానికే శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications