మాఘ పౌర్ణమినాడు తిరుమలలో ఆ తీర్థంలో స్నానంలో చేస్తే..: మరో ముక్కోటికి సర్వం సిద్ధం
మాఘ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ, రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలను కన్నులపండువగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఆదివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఈ గరుడ వాహనసేవ నిర్వహిస్తూ వస్తోన్నారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు. నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. మాఘ పౌర్ణమి కావడం వల్ల ఈ గరుడసేవకు మరింత విశిష్ఠత ఏర్పడింది.
మాఘ పౌర్ణమి గరుడ సేవ, శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. సెలవురోజు కూడా కావడంతో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటోంది. దీనికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు.

పురాణాల పరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఇందులో సప్త తీర్థాలు అతి ముఖ్యమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఈ తీర్థాల్లో స్నానమాచరించిన భక్తులకు ముక్తి మార్గం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇందులో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలను ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ రామకృష్ణ తీర్థం. మాఘ పౌర్ణమి నాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినాన్ని టీటీడీ ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీరామకృష్ణుడనే మహర్షి.. తిరుమలగిరుల్లో ఒకటైన వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ప్రత్యేకంగా ఈ తీర్థాన్ని సృష్టించుకున్నాడని స్కంద పురాణంలో ఉంది.
ఈ పర్వదినం నాడు ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు, ఇతర పూజా సామగ్రిని తీసుకుని వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున.. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications