శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం- ఎల్లుండే..!!
శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టీటీడీ అధికారులు మరో శుభవార్త వినిపించారు. వసతి గదుల కోటాను ఎప్పుడు విడుదల చేస్తారనేది వెల్లడించారు.
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 61,265 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 27,078 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.

వసతి కోసం..
దేశం నలుమూలల నుంచి తిరుమలేశుడిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి గదుల కోటాను ఎప్పుడు విడుదల చేస్తారనేది టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమలలో వసతి గదుల కోటా బుకింగ్ ను ఆరంభించనున్నారు. మార్చి నెలకు సంబంధించిన బుకింగ్ కోటా ఇది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే అకామడేషన్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కాటేజీలు ఇవే..
తిరుమలలో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీవేంకటేశ్వర అతిథి గృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

ఇప్పటికే రూ.300 టికెట్స్
కాగా- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అధికారులు మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను శుక్రవారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్, మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు కూడా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చాయి. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మార్చి నెల టికెట్లను సైతం అధికారులు విడుదల చేశారు.

ఆర్జిత సేవా టికెట్లు..
ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్యోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లను కూడా టీటీడీ అధికారులు విడుదల చేశారు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఇతర ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేశారు. ఆన్ లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియను ఈ నెల 22వ తేదీ నాడే ప్రారంభించారు. లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు- డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా వసతి గదులకు సంబంధించిన మార్చి నెల కోటాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు.












Click it and Unblock the Notifications