నవంబర్లో శ్రీవారికి విశేష ఉత్సవాలు- కార్తీక శోభ
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. శని, ఆదివారాల్లో వేలాదిమంది శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు.
ఆదివారం నాడు 85,497 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,873 మంది తలనీలాలను సమర్పించారు. 4 నుంచి 6 కంపార్ట్మెంట్లల్లో వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పడుతోంది. హుండీ ద్వారా 2.41 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

ఈ నెల మొత్తంగా నిర్వహించబోయే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. దీపావళి అస్థానం, వార్షిక పుష్పయాగం, కైశిక ద్వాదశి ఆస్థానం, కార్తీక పౌర్ణమి.. వంటి పర్వదినాలు ఉన్నాయి. నవంబర్ 9వ తేదీన మతత్రయ ఏకాదశితో ఈ విశేష ఉత్సవాల సందడి మొదలవుతుంది.
నవంబర్ 11వ తేదీన మాస శివరాత్రి, 12వ తేదీన దీపావళి ఆస్థానం, 13వ తేదీన కేదారగౌరీ వ్రతం, 14వ తేదీన శ్రీ తిరుమలనంబి శాత్తుమొర ఉత్సవాలను నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. 15న భగనీ హస్త భోజనం, 16వ తేదీన శ్రీమనవాళ మహాముని శాత్తుమొరను ఘనంగా చేపడతారు.
17వ తేదీన నాగుల చవితి పండగను జరుపుతారు. అదే రోజున మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంలో భక్తులను కటాక్షిస్తాడు. 18వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ చేస్తారు. 19న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, స్కంద షష్టి ఉత్సవాలను నిర్వహిస్తారు.
22వ తేదీన శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 23న ప్రబోధన ఏకాదశి, నవంబరు 24న కైశిక ద్వాదశి ఆస్థానం, అదే రోజున శ్రీ చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమాలను చేపడతారు. 26వ తేదీన కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని దీపాలతో అలంకరిస్తారు. 27వ తేదీన శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర ఉంటుంది. 28న శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రంతో ఈ విశేష ఉత్సవాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications