రూ.300ల శ్రీవారి ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల జారీ వివరాలొచ్చేశాయ్: ముందస్తు తేదీలివే
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణ స్థితిలో కొనసాగుతోంది. నాలుగు కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి అయిదు నుంచి ఏడు గంటల సమయం పడుతోంది. మంగళవారం 67,828 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,621 మంది తలనీలాలను సమర్పించుకున్నారు.
హుండీ ద్వారా కానుకల ద్వారా 5.14 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మేలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోన్నారు.

ఇప్పుడున్న భక్తుల రద్దీ జూలై 15వ తేదీ వరకు కొనసాగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, 300 రూపాయల దర్శనం టికెట్ల సంఖ్యను కుదించారు.
తాజాగా మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆన్లైన్ ద్వారా వాటిని బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.
జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లను భక్తులకు కేటాయిస్తారు. ఈ టికెట్లు పొందిన వారు ఆర్జిత సేవా టికెట్ల మొత్తాన్ని చెల్లించి స్లాట్ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

అదేవిధంగా, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను అదే రోజున అంటే ఈ నెల 20వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.
అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. తిరుమలలో మే నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను ఈ 26వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణువాసం వంటి వసతి గదులకు సంబంధించిన మే నెల గదుల కోటాను ఈ 27న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications