శివయ్య సేవలో సీఎం: కొడాలి నానితో కలిసి పాలాభిషేకం: వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు
మచిలీపట్నం: మహా శివరాత్రి పర్వదినం.. దేశవ్యాప్తంగా వైభవంగా సాగుతోంది. శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. లక్షలాది మంది భక్తులు శివయ్య సేవలో తరిస్తున్నారు. తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, యాగంటి వంటి శైవక్షేత్రాలు పరమశివుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి వేలమంది భక్తులు వారణాశికి చేరుకున్నారు. గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. నదీ స్నానాలను ఆచరిస్తున్నారు.
మహారాష్ట్రలోని కొన్ని ప్రఖ్యాత శివాలయాల్లో భక్తులకు అనుమతి ఇవ్వట్లేదు. కరోనా వైరస్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నందున.. అక్కడి ఆలయాల్లో భక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు. త్రయంబకేశ్వరం వంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో కలిసి శివలింగానికి పాలాభిషేకం చేశారు.

ప్రత్యేక పూజలతో పాటు యాగశాలలో పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి తిరుగుప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రి వెంట జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

వైవీ సుబ్బారెడ్డి సతీమణి తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చుకులు ఆమెకు శాలువా కప్పి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.












Click it and Unblock the Notifications